నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం డా. బిఆర్ అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా అటవీ అధికారి పద్మజ, భువనగిరి, చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.