– ప్రయివేటు వ్యక్తుల భూములపై దాడి
– పోలీసుల అదుపులో పలువురు నిందితులు
నవతెలంగాణ-రామచంద్రాపురం
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా కొల్లూరులో గురువారం అర్ధరాత్రి 9 ఎకరాల భూమిని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జాకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. భూ యజమానులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లాపూర్ డివిజన్ కొల్లూరు పరిధిలోని మాధవి అనే మహిళకు చెందిన సర్వే నంబర్ 192/ఆ9/అ లోని 5.12 గుంటల ప్రయివేట్ భూమిని, చదలవాడ శ్రీనివాస్కు చెందిన 4 ఎకరాల్లో ఏషియన్ టింబర్ డిపో స్థలాన్ని కబ్జా చేసేందుకు 200 మంది గుర్తు తెలియని వ్యక్తులు వాహనాల్లో భూముల వద్దకు చేరుకున్నారు. మాధవికి చెందిన ప్రయివేటు భూమిలో ఉన్న టేకు, వెదురు చెట్లను నరికి కంటైనర్లో లోడ్ చేశారు. శ్రీనివాస్కు చెందిన టింబర్ డిపో ప్రహరీ గోడను జేసీబీలతో తొలగించారు. అక్కడే ఉన్న ముగ్గురు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగి వద్ద వదిలిపెట్టారు. సెక్యూరిటీలోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా సూపర్ వైజర్కు సమాచారం ఇవ్వడంతో ఆయన కొల్లూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు 20 మంది మహిళలు, 12 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కొల్లూరు సీఐ గణేష్ పటేల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా, భూకబ్జాకు ప్రయత్నించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
కొల్లూరులో భూకబ్జా కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



