ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్ : ప్రకృతి విపత్తుల్లో ఇండ్లు కోల్పోయిన వారికి లీజు పద్ధతిలో భూమిని కేటాయిస్తామని జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గురువారం ప్రకటించారు. 2025లో ప్రకృతి వైపరీత్యాలతో నివాసాలను కోల్పోయిన కుటుంబాలకు 40ఏండ్ల లీజు ప్రాతిపదికన ఐదు ‘మర్లాస్’ (1.60 ఎకరాలు) భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. ఉదంపూర్ జిల్లాలో మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రభావితమైన 6,400 కుటుంబాలకు రూ.23.49 కోట్లకు పైగా ఆర్థికసాయం అందించినట్టు ఆయన తెలిపారు.
బీజేపీ సభ్యుడు బల్వంత్ సింగ్ మంకోటియా అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ఒమర్ అబ్దుల్లా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని, ఈ ఏడాది జనవరి 2న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో భూకంపాలు, క్లౌడ్బరెస్ట్స్, కొండచరియలు విరిగిపడటం, వరదలతో నిరాశ్రయులైన ప్రతి భూమి లేని కుటుంబానికి ఐదు మర్లాస్ (1.60 ఎరాలు) ప్రభత్వు భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. నివాస అవసరాల కోసం ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండా లీజు ప్రాతిపదికన భూమిని అందిస్తామని ఆయన చెప్పారు. లబ్ధిదారులు 40 సంవత్సరాల కాలానికి మార్లాకు రూ.10 వార్షిక గ్రౌండ్ అద్దె చెల్లించాల్సి వుంటుంది. దీనిని సమర్థ అధికారం ఆమోదం పొందిన తర్వాత నిబంధనల ప్రకారం మరింత పొడిగించవచ్చు అని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న షరతులకు లోబడి కేటాయింపు వుంటుందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
ఉధంపూర్, చెనాని, రామ్నగర్ మరియు లట్టి-మరోతి తహసీల్లో మొత్తం 6,449 బాధిత కుటుంబతాలకు నిర్దేశించిన నిబంధనల ప్రకారం పరిహారం అందించబడిందని అన్నారు. ఉధంపూర్ తహసీల్లోని 2,666 బాధిత కుటుంబాలకు రూ.9.32కోట్లు, చెనాని తహసీల్లోని 1,208 కుటుంబాలకు రూ.5 కోట్లకు పైగా మంజూరైందని చెప్పారు. రామ్నగర్ తహసీల్లో 2,298 బాధిత కుటుంబాలకు రూ.7.8635కోట్లు మంజూరు కాగా, లట్టి-మరోతి తహసీల్లో 277 కుటుంబాలకు కోటి రూపాయలకు పైగా సాయం అందించబడిందని అన్నారు. నష్ట అంచనాను నిర్వహించామని మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కేసులను ధ్రువీకరించామని అన్నారు. సంబంధిత ఆర్థిక విధానాల ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం మంజూరైందని, నేరుగా పంపిణీ చేశామని అన్నారు.
విపత్తు బాధితులకు లీజు ప్రాతిపదికన భూమి
- Advertisement -
- Advertisement -



