శాస్త్రీయ సామ్యవాదానికి తిరుగులేదు
అణచివేత వ్యతిరేక పోరాటానికి మతం రంగు
ముస్లిం వ్యతిరేక పోరాటంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ చిత్రీకరణ
ఏచూరి స్ఫూర్తితో పురోగమిద్దాం.. : ఖమ్మంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
శాస్త్రీయ సామ్యవాదానికి తిరుగులేదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. మోడీ, షా, ఆర్ఎస్ఎస్ త్రిశూలంలా వ్యవహరిస్తూ మెజారిటీ ప్రజానీకాన్ని మత ప్రాతిపదికన విభజించాలని చూస్తున్నాయని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని సైతం వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో బుధవారం ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభ’లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సభకు ముందుగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరులకు జోహార్లు తెలుపుతూ ఎంఏ బేబీ ప్రసంగించారు. దున్నే వానికి భూమి, భూ సంస్కరణల అమలు సాయుధ పోరాట ఫలితమేనని అన్నారు. సాయుధ పోరాట ఫలితంగానే కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో తొలుత భూ సంస్కరణలు అమలు అయ్యాయని, ఆ తర్వాతే దేశవ్యాప్తంగా విస్తరించారని తెలిపారు.
దేశ స్వాతంత్య్రం కోసం, నైజాం ప్రభువుకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ఎక్కడా పోరాడలేదన్నారు. మోడీ, షాతో పాటు రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్న రాజ్నాథ్ సింగ్ వీర తెలంగాణ పోరాటానికి మతం రంగు పులుముతున్నారని చెప్పారు. శ్రమజీవుల పోరాట ఫలితంగానే తెలంగాణలో నాటి ఫ్యూడల్ ప్రభుత్వం కూలిందన్నారు. ఎంతో మహత్తర చరిత్ర ఉన్న సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరించటం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. తనను ఏ మతాచారం ప్రకారం ఖననం చేయోద్దని నెహ్రూ చెప్పారనీ, స్వామి నారాయణగురు కులం, మతం లేదని అంటే, మహాత్మా గాంధీ వర్క్ ఈజ్ వర్షిప్ (పని దైవంతో సమానం) అన్నారని గుర్తు చేశారు. అన్ని మతాల ప్రజలు సహజీవనం చేస్తున్న దేశంలో ఆర్ఎస్ఎస్ విద్వేషాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని చూస్తుందని విమర్శించారు. గోల్వాల్కర్ ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకంలో ముస్లిం, క్రిస్టియన్, కమ్యూనిస్టులను శత్రువులుగా పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో విశాల ప్రాతిపదికన ఎర్రజెండా ఉనికిని విస్తరింప చేయాలని పిలుపునిచ్చారు.
శ్రామిక వర్గ నేత ఏచూరి
అద్భుతమైన అసాధారణ శ్రామిక వర్గ నేతగా సీతారాం ఏచూరిని గుర్తుంచుకోవాలని ఎంఏ బేబీ అన్నారు. ఏచూరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 14వ పార్టీ జాతీయ కాంగ్రెస్లో బసవ పున్నయ్య ఇచ్చిన భరోసాతో సీతారాం ఏచూరి శాస్త్రీయ సామ్యవాదానికి తిరుగులేదనే రీతిలో డ్రాఫ్ట్ నెగ్గేలా చూశారన్నారు. ప్రముఖ విద్యావేత్త ఐవీ రమణారావు బేబీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించారు. అంతకుముందు సీతారాం ఏచూరిపై నవతెలంగాణ, ప్రజాశక్తి ప్రచురించిన ‘ ఓ సోషలిస్ట్ ఆచరణ పథం’ పుస్తకాన్ని బేబీ ఆవిష్కరించారు. పార్టీ రాజకీయ విద్యా విభాగం సభ్యులు ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం’ జ్ఞాపికను బేబీకి అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, బుగ్గ వీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, వై. విక్తమ్, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, ఎం. సుబ్బారావు, చింతలచెరువు కోటేశ్వరరావు, పి.సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
సాయుధ పోరాట వక్రీకరణ అసాధ్యం : తమ్మినేని
బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎంత ప్రయత్నించినా తెలంగాణ సాయుధ పోరాట వక్రీకరణ సాధ్యం కాదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీని ఆయా పార్టీలు విద్రోహ దినం, విలీన దినం, విమోచన దినంగా పేర్కొంటున్నాయని తెలిపారు. ఎవరెలా చెప్పినా సాయుధ పోరాటం ఎర్రజెండా పోరాటం తప్ప మరి ఏదీ కాదన్నారు. నెహ్రూ సైన్యం కమ్యూనిస్టులను బలిగొనేందుకు వచ్చిందే తప్ప నిజాంను లొంగ తీసుకునేందుకు కాదన్నారు. ఒకవేళ లొంగ తీసుకునేందుకు వస్తే రాజ్ ప్రముఖ్ హౌదా ఇచ్చేది కాదని తెలిపారు. రూ. లక్షల విలువైన భరణాలు ప్రసాదించేది కాదన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా 3,000 గ్రామాలకు విముక్తి లభించిందని తెలిపారు. నెహ్రూ సైన్యాలు 4000 మంది కమ్యూనిస్టులను పొట్టన పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో ఎర్రజెండా ఎగురుతుందనే ఉద్దేశంతోనే నెహ్రూ సైన్యాన్ని పంపారని వివరించారు. సభ ప్రారంభానికి ముందు సదానందం నేతత్వంలో ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన ‘సాయుధ రైతాంగ పోరాట గీతాలు’ ఆకట్టుకున్నాయి.