జూబ్లీహిల్స్లో 2 వేల గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్టుకు చేరువలో ప్రధాన రహదారికి ఆనుకుని ఆక్రమణలకు గురైన భూమిని హైడ్రా కాపాడింది. 2 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ దాదాపు రూ.100 కోట్ల వరకూ ఉంటుంది. రెండు దశాబ్దాలుగా అక్రమార్కుల చేతిలో కబ్జా అయిన భూమికి హైడ్రా సోమవారం విముక్తి కల్పించింది. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఈ భూమి లేఔట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించినది. అయితే, పిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి ఆక్రమించి నకిలీ(తప్పుడు) ఇంటి నెంబర్ సృష్టించి అందులో నర్సరీ నడుపుతున్నాడు. గతంలో సత్యనారాయణపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ పలుమార్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టును కూడా తప్పుదోవ పట్టించి స్టేటస్కో తెచ్చుకున్నాడు. స్టేటస్కో ఉండగా, అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరాదు. నర్సరీ నడపరాదు. కానీ, అనుమతి లేని షెడ్ల నిర్మాణాలు, నర్సరీతో వ్యాపారం నిర్వహించారు.
ప్రజావాణిలో ఫిర్యాదు మేరకు..
జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ అవకతవకలపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. లేఔట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలంగా నిర్ధారించారు. నర్సరీ నడుపుతున్న సత్యనారాయణకు హైడ్రా నోటీసులిచ్చింది. ఈ నోటీసులపై తిరిగి హైకోర్టును ఆశ్రయించిన సత్యనారాయణకు అక్కడ చుక్కెదురైంది. గతంలో ఉన్న స్టేటస్కోను కూడా కొట్టేసి హైడ్రా తీసుకోబోయే చర్యలకు హైకోర్టు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాలతో సోమవారం ఉదయం జూబ్లీహిల్స్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అంతకుముందు నర్సరీలో మొక్కలను తరలించుకునేందుకు అవకాశం కల్పించింది. అనంతరం షెడ్లతో పాటు ఆక్రమణలను హైడ్రా తొలగించింది. దీంతో 2000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు పేర్కొంటూ బోర్డు పెట్టింది. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు రవీంద్రనాథ్తోపాటు పాలకమండలి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సుదీర్ఘ న్యాయం పోరాటం ఫలించిందన్నారు. రూ.వంద కోట్ల భూమిని కబ్జాదారుల నుంచి విడిపించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.