Sunday, June 22, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిభాషావేశం

భాషావేశం

- Advertisement -

అన్నిటికి ఆద్యుడు మానవుడు. భాషకు పురుడు పోసిందీ అతడే. సంస్కృతిని నిర్మించుకున్నదీ, తనకు తాను మార్చుకొన్నదీ, సమాజాన్ని ఏర్పరచుకున్నదీ అంతా మానవ ప్రయత్నాల్లోంచే ఏర్పడ్డది. అలా ఏర్పడ్డ సమాజం తిరిగి మనిషిని మలిచే పనికి పూనుకున్నది. సంస్కృతినీ పునర్నిర్మించింది కూడా. మానవునిలోని మంచిచెడుల ప్రతిఫలనం సంస్కృతిలో ప్రతిబింబిస్తుంది. భాష కూడా అంతే. అది ఒక మాధ్యమం. సంస్కృతిలో అదొక భాగం. అంతేకాని తమకు తాముగా భాషల్లో ఉచ్ఛనీచాలు ఉండవు. మానవుల అభివృద్ధికి సేవ చేసేందుకు ఉపయోగపడుతూ ఎదిగినవే ప్రపంచంలోని భాషలు. మానవ సమూహాల ప్రవర్తనలోని మంచి చెడ్డలను విభేదించవచ్చు. కానీ భాషలను కాదు. భాషలను అభిమానించవచ్చు. కానీ భాషలను ద్వేషించడం, భాషాదురభిమానాలు పెంచడం నాగరికుల లక్షణం కాదు.
మొన్నీ మధ్య మన దేశ హోంమంత్రి అమిత్‌షా ఢిల్లీలో ఒక పుస్తకావిష్కరణసభలో మాట్లాడుతూ ఆంగ్లభాష మాట్లాడేవారు సిగ్గుపడేరోజు వస్తుందని, ఆ భాష వలసవాదానికి, బానిసత్వానికి చిహ్నమని సెలవిచ్చారు. ప్రపంచంలోని ఏభాషను మాట్లాడినా సిగ్గుపడాల్సిన పనేముంది! ఏదైనా తప్పు పనిచేస్తే తప్ప.వాస్తవానికి సిగ్గుపడాల్సినది దేనికంటే, మనపై రెండు వందలేండ్లు పెత్తనం చేసి దోపిడీ చేసిన ఆంగ్లేయులకు క్షమాభిక్ష రాసిచ్చి, మీకు సహకరిస్తామని చెప్పి ఇంగ్లీషువాళ్లని పొగిడిన సావర్కర్‌ వారసత్వాన్ని కలిగి ఉన్నందుకు నిజంగా సిగ్గుపడాలి కదా! సిగ్గు పడాల్సింది వాళ్ల భాషను మాట్లాడ్డానికి కానే కాదు. వాస్తవంగా ఆనాడు ఆంగ్లేయుల విద్యను అభ్యసించిన యువతనే స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి ఆలోచించింది. స్వాతంత్య్ర పోరాటంలోకి దూకింది. ప్రపంచ గమనాలను అవగాహన చేసుకున్నది. ప్రాచీన భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి ప్రకారమైతే సముద్రయానాన్నే నిషేధించింది. విద్యను కూడా కొన్ని వర్గాలకే అనుమతించింది. భాషా పాండిత్యాలను అశేష ప్రజానీకానికి దూరంగా ఉంచింది. వాస్తవంగా ఉత్పత్తి కార్యక్రమాల్లో శ్రమచేస్తున్న వారికి విద్యనందించడం నిషేధించింది. వర్ణాశ్రమ ధర్మాల పేర ప్రజలను ఉచ్ఛ నీచాలుగా విభజించి అవమానపర్చింది. ఇందుకు మనం సిగ్గుపడాలి. రెండు శతాబ్దాల పాటు మనల్ని అణచివేసినది ఆంగ్లేయుల సామ్రాజ్యవాద కాంక్ష. ఇది నిజం. అందుకేవారినీ, వారి విధానాన్ని తరిమికొట్టాం. అంతే. వారు తీసుకొచ్చిన సాంకేతిక నైపుణ్యం, సైన్సు, భాషలను దూరం పెట్టాల్సిన పనిలేదు.
ఇంకా విచిత్రమేమిటంటే, షా గారు మాట్లాడుతూ…స్థానిక భాషలతోనే భారతీయ సంస్కృతి, వారసత్వాలకు గుర్తింపు అని వక్కాణించారు. కానీ దక్షిణాది రాష్ట్రాలపై నూతన విద్యావిధానం పేర హిందీభాషను రుద్దే ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే ఈ మాటలు మాట్లాడటం బహు విడ్డూరం. మతపరమైన జాతీయవాదాన్ని తీసుకువచ్చి, భిన్న సంస్కృతులు, భాషలు, జాతులు గల సమాజాన్ని ఏకశిలా రూపంగా మార్చాలనే మతోన్మాద ఆలోచనలను రుద్దే వీరు, భాషాద్వేషాలను పెంచేవీరు ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఎవరు అవునన్నా కాదన్నా మన దేశంలో సాధారణ మాధ్యమంగా ఆంగ్లం కొనసాగుతోంది. ప్రపంచీకరణ తర్వాత భారతీయులు ఎంతోమంది ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఈ మాధ్యమం ద్వారానే పొందుతున్నారు. ఒక భాషగా ప్రపంచం ఆంగ్లాన్ని వాడుతున్నది. ఆ భాషను మాట్లాడటం అవమానకరమైన దేమీకాదు. ఇప్పుడసలు వాడుకలో లేని సంస్కృతాన్ని తెచ్చి రుద్దాలనుకోవటం పిచ్చితనం అవుతుంది.
రాహుల్‌గాంధీ చేసిన విమర్శలో ఉన్నట్టుగా, ”బీజేపీ, ఆరెస్సెస్‌ నేతల పిల్లలు మాత్రం ఇంగ్లీషు విద్య కోసం విదేశాలకు వెళ్తారు. ఆంగ్లంలోనే విద్యనభ్యసిస్తారు. దేశంలోని పేద పిల్లలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర ఇది’ అన్న మాటల్లో వాస్తవం కనిపిస్తోంది. వారి నాయకుల పిల్లలు సిగ్గుపడాల్సిందేనా! సాంస్కృతికపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే నిషా స్వరాల మాటల్లోని మర్మాలను పనిగట్టుకుని పసిగట్టవలసి ఉంటుంది!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -