ఢిల్లీలో హైఅలర్ట్
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దేవాలయాలు, రద్దీ ప్రదేశాల్ని టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా దాడులకు కుట్ర పన్నిందని నిఘా వర్గాల సమాచారం. దీంతో ఢిల్లీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ఢిల్లీలో చారిత్రక ప్రదేశాలైన ఎర్రకోట, చాందినీ చౌక్ పరిసర దేవాలయాల్లో ఐఈడీలతో పేలుడుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై.. ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.
అలాగే అన్ని స్థాయిల్లో భద్రతను 24 గంటలు పర్యవేక్షించేలా పార్లమెంటరీ బృందాలు పనిచేస్తున్నాయి.ఇటీవల పాకిస్తాన్ ఇస్లామాబాద్ షియా మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. దీనిలో భాగంగా పాక్కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తొయిబా భారత్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు రహస్య సమాచారం అందింది.



