Thursday, June 19, 2025
E-PAPER
Homeజాతీయంపాలన వదిలేసి కక్ష సాధింపులు

పాలన వదిలేసి కక్ష సాధింపులు

- Advertisement -

– రెడ్‌బుక్‌ రాజ్యాంగంతోనే అక్రమ కేసులు
– రెంటపాళ్లలో వైసిపి నేత విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ సిఎం జగన్‌
– నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు : ఐజి
గుంటూరు :
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులకు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుకు సిఎం చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విమర్శించారు. బుధవారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో జగన్‌ పర్యటన దాదాపు ఏడు గంటల పాటు జరిగింది. ఉదయం పది గంటలకు గుంటూరు చేరుకున్న జగన్‌ ప్రదర్శనగా బయలుదేరి సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు సాయంత్రం ఐదు గంటలకు చేరుకున్నారు. దాదాపు ఆరు గంటలకు పైగా ర్యాలీలో నిలబడే ప్రజలకు జగన్‌ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో బుధవారం సాయంత్రం వైసిపి నాయకుడు నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. 2024లో ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నాగమల్లేశ్వరరావు ఇంటిపై టిడిపి వారు దాడి చేశారని, పోలీసులు తీవ్రంగా బెదిరించి గ్రామం విడిచి వెళ్లకుంటే రౌడీ షీట్‌ ఓపెన్‌చేస్తామని ఒత్తిడి చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్నారని జగన్‌ ఆరోపించారు. నాగమల్లేశ్వరరావు మృతి చెంది ఏడాది అయిన సందర్భంగా గ్రామంలో ఆయన విగ్రహన్ని ఏర్పాటు చేశారు.
ఈ విగ్రహాన్ని జగన్‌ ఆవిష్కరించారు. మల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లును పరామర్శించారు. అనంతరం మీడియాతో జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొంత మంది పోలీసు అధికారులు కుల ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని వారికి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సినిమా చూపిస్తామన్నారు. ఇటీవల రాజుపాలెం మండలం కోటనెమలిపురి గ్రామంలో లక్ష్మీనారాయణ అనే వైసిపి కార్యకర్తను సత్తెనపల్లి డిఎస్‌పి హనుమంతరావు వేధించారని దీంతో ఆయన ఆత్మహత్యయత్నం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పారు. వైసిపిలోని వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్‌, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్‌, పోసాని కృష్ణమురళీ, మంగళగిరికి చెందిన రాజ్‌కుమార్‌, కృష్ణవేణి, ఇంటూరు రవి తదితరులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని విమర్శించారు. పోలీసులు చంద్రబాబు చేసే పాపాల్లో భాగస్వామ్యం కావద్దని హితవు పలికారు. మరో నాలుగేళ్లలో పరిస్థితులు మారతాయని, తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పుడు తప్పులు చేసిన అధికారులకు సినిమా చూపిస్తాం అని హెచ్చరించారు. చంద్రబాబు పాలనపై వ్యతిరేకత వచ్చిందని మళ్లీ వైసిపి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇద్దరు మృతి
జగన్‌ కాన్వారు సత్తెనపల్లి చేరుకోగానే తీవ్ర తొక్కిసలాట జరిగింది. గడియారం స్తంభం వద్ద జరిగిన తొక్కిసలాటలో జయవర్దన్‌ రెడ్డి (32) అనే కార్యకర్త మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగన్‌ కాన్వారును అనుసరిస్తున్న వాహనం గుంటూరు ఏటుకూరు రోడ్డులో గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెం నుంచి వచ్చిన సిహెచ్‌. సింగయ్య అనే కార్యకర్తను ఢకొీంది. దీంతో ఆయన తీవ్రగాయాలతో రోడ్డుపక్కన పడిపోయారు.గమనించిన పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. జగన్‌ తన పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించినందుకు చట్ట ప్రకారం తగిన చర్యలు ఉంటాయని ఐజి త్రిపాఠి, ఎస్‌పి సతీష్‌కుమార్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -