– 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు
– ఛేదనలో మెరిసిన డకెట్, రూట్, క్రాలీ
– వికెట్ల వేటలో భారత బౌలర్లు విఫలం
తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి ఐదు సెంచరీలు. అయినా, లీడ్స్ టెస్టులో భారత్కు భంగపాటు తప్పలేదు. వికెట్ల వేటలో ఏమాత్రం బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. బజ్బాల్ జోరుకు ఆఖరు రోజు ఆటలో ఏ దశలోనూ కళ్లెం వేయలేదు. ఫలితంగా, ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన తొలి టెస్టులో గిల్సేనకు ఓటమి ఎదురైంది.
370 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ బజ్బాల్ ఊదేసింది. బెన్ డకెట్ (149), జో రూట్ (53 నాటౌట్), జాక్ క్రాలీ (65) ఛేదనలో మెరువగా.. ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో మెరుపు విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. లీడ్స్లో ఇంగ్లాండ్కు ఇది వరుసగా ఆరో విజయం కావటం గమనార్హం.
నవతెలంగాణ-లీడ్స్
‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీ తొలి టెస్టులో బజ్బాల్ పైచేయి సాధించింది. భయమెరుగని ధనాధన్ ఆట తీరుతో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో భారత్పై గెలుపొందింది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 82 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ బెన్ డకెట్ (149, 170 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకంతో చెలరేగాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలీ (65, 126 బంతుల్లో 7 ఫోర్లు), జో రూట్ (53 నాటౌట్, 84 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (33, 51 బంతుల్లో 4 ఫోర్లు), వికెట్ కీపర్ జెమీ స్మిత్ (44 నాటౌట్, 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ (2/92), రవీంద్ర జడేజా (1/104), శార్దుల్ ఠాకూర్ (2/51) వికెట్లు పడగొట్టారు. జశ్ప్రీత్ బుమ్రా (0/57), మహ్మద్ సిరాజ్ (0/51) వికెట్ల వేటలో నిరాశపరిచారు. ఛేదనలో సూపర్ సెంచరీ సాధించిన బెన్ డకెట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. లీడ్స్ టెస్టులో విజయంతో టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యం సాధించింది. భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టు జులై 2 నుంచి బర్మింగ్హామ్లో జరుగుతుంది.
ఓపెనర్లు లాగేసుకున్నారు!
ఓవర్నైట్ స్కోరు 21/0తో ఆఖరు రోజు ఛేదనకొచ్చిన ఇంగ్లాండ్ను ఓపెనర్లు ముందుండి నడిపించారు. ఫామ్లో లేని జాక్ క్రాలీ సైతం అర్థ సెంచరీతో కదం తొక్కాడు. కొత్త బంతిపై క్రాలీ ఆచితూచి ఆడినా.. మరో ఎండ్ నుంచి డకెట్ దూకుడుగా ఆడాడు. ఎనిమిది ఫోర్లతో డకెట్ 66 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 117/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. బంతిపై మెరుపు తగ్గాక, రెండో సెషన్లో పరుగుల వరద పారింది. 14 ఫోర్లతో డకెట్ 121 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 40.5 ఓవర్ వద్ద వర్షం అంతరాయం కలిగించినా.. అదేమీ భారత బౌలర్ల వికెట్ల వేటకు ఉపయుక్తం కాలేదు!. ఐదు ఫోర్లతో 111 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన క్రాలీ సహా ఒలీ పోప్ (8)ను ప్రసిద్ కృష్ణ సాగనంపాడు. కానీ జో రూట్ (53 నాటౌట్)తో కలిసి డకెట్ మరో కీలక భాగస్వామ్మం నిర్మించాడు. భారత ఆశలను ఆవిరి చేసిన డకెట్ను శార్దుల్ అవుట్ చేసినా.. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 253/3. ఇక్కడ్నుంచి జో రూట్.. ఛేదనను నడిపించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (33), జెమీ స్మిత్ (44 నాటౌట్)తో బజ్బాల్ కొనసాగించాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగిన స్మిత్.. వేగంగా లాంఛనం ముగించాడు. 82 ఓవర్లలో 4.54 రన్రేట్తో ఇంగ్లాండ్ 373 పరుగులు చేసింది. ఆఖరు గంట వరకు సాగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో మెరుపు విజయం సాధించింది.
బౌలర్లు విఫలం
మూడేండ్ల క్రితం బర్మింగ్హామ్ టెస్టులో భారత్పై 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లాండ్.. తాజాగా లీడ్స్ టెస్టులో 371 పరుగుల టార్గెట్ను ఊదేసింది. ఐదో రోజు పిచ్పై భారత బౌలర్లు వికెట్లు పడగొట్టడంలో తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టిన జశ్ప్రీత్ బుమ్రా.. రెండో ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఏ దశలోనూ మన బౌలర్లు రెండు వైపుల నుంచి ఒత్తిడి పెంచలేదు. ఫలితంగా, బజ్బాల్ దూకుడుతో ఇంగ్లాండ్ స్టయిల్గా మరో ఘన విజయం ఖాతాలో వేసుకుంది. లీడ్స్లో అత్యధిక సెషన్ల పాటు ఆధిపత్యం చెలాయించిన భారత్.. చెత్త ఫీల్డింగ్తో క్యాచ్లతో పాటు మ్యాచ్నూ వదిలేసింది.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 471/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 465/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : 364/10
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : జాక్ క్రాలీ (సి) రాహుల్ (బి) ప్రసిద్ 65, బెన్ డకెట్ (సి) నితీశ్ కుమార్ (బి) ఠాకూర్ 149, ఒలీ పోప్ (బి) ప్రసిద్ 8, జో రూట్ నాటౌట్ 53, హ్యారీ బ్రూక్ (సి) పంత్ (బి) ఠాకూర్ 0, బెన్ స్టోక్స్ (సి) గిల్ (బి) జడేజా 33, జేమీ స్మిత్ నాటౌట్ 44, ఎక్స్ట్రాలు : 21, మొత్తం : (82 ఓవర్లలో 5 వికెట్లకు) 373.
వికెట్ల పతనం : 1-188, 2-206, 3-253, 4-253, 5-302.
బౌలింగ్ : జశ్ప్రీత్ బుమ్రా 19-3-57-0, మహ్మద్ సిరాజ్ 14-1-51-0, రవీంద్ర జడేజా 24-1-104-1, ప్రసిద్ కృష్ణ 15-0-92-2, శార్దుల్ ఠాకూర్ 10-0-51-2.
లీడ్స్ ఇంగ్లాండ్ సొంతమాయె
- Advertisement -
- Advertisement -