కథానాయకుడు విశ్వక్ సేన్, సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘లెగసీ’. ‘పిండం’ చిత్రాన్ని నిర్మించిన కలాహీ మీడియా పతాకంపై తెరకెక్కుతోన్న రెండవ చిత్రమిది.
నూతన సంవత్సర సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ, అద్భుతమైన టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘లెగసీ’ ఒక రాజకీయ నేపథ్యంతో సాగే కథ. అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడైన తన తండ్రి వారసత్వాన్ని అనివార్యంగా మోయవలసి వచ్చే సిద్ధార్థ్ అనే యువకుడి కథగా ఇది రూపొందుతోంది. వారసుడు లేని కుర్చీ చుట్టూ తిరిగే అవకాశవాద రాజకీయ రాబందులను తాను ఎంతగా ద్వేషిస్తాడో చెప్పే విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్తో టీజర్ ప్రారంభమవుతుంది.
రాజకీయ క్రీడలు, ఉన్నత స్థానాన్ని పొందడానికి వేసే ఎత్తుగడలు, అవకాశవాద రాబందుల మోసం తనకు నచ్చక పోయినా.. వారసత్వాన్ని ఎవరో ఒకరి సమర్థ భుజాలపై మోయాల్సిన అవసరం ఉన్నందున, తాను ఆ బాధ్యతను చేపట్టాల్సి వచ్చిందని చెబుతాడు. తన దివంగత తండ్రి స్మారక చిహ్నాన్ని సందర్శించడానికి వెళ్తున్నట్లు విశ్వక్ సేన్ పాత్రను పరిచయం చేశారు. అక్కడ అతను మృతదేహంపై మూత్ర విసర్జన చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం వైవిధ్యంగా ఉంది. ఆ తర్వాత రాజకీయ నాయకుల మధ్య అతను తుపాకీ పట్టుకొని కనిపించడం, తన గదిలో కాల్పులు జరగడం వంటి దశ్యాలు ఉత్కంఠను పెంచాయి. క్రూరంగా, రూఢిగా, దుఃఖంతో నలిగిపోయిన, మనసు విరిగిపోయిన, మొరటు వ్యక్తిగా విశ్వక్ సేన్ మెప్పించారు. ఆయన లుక్, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పొలిటికల్ డ్రామాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
నటనా నైపుణ్యం, కళ్లలో కనిపించే తీవ్రత, నడక, బాడీ లాంగ్వేజ్తో పాత్రలో పూర్తిగా లీనమైపోయిన తీరు ఈ చిత్రంపై అంచనాలను, ఉత్సుకతను పెంచుతోంది. ‘పిండం’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తర్వాత దర్శకుడు సాయి కిరణ్ దైదా ఒక ఉత్కంఠభరితమైన పొలిటికల్ డ్రామాకి ప్రాణం పోసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తుండగా, రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, కే కే మీనన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జిజు సన్నీ, కూర్పు: శిరీష్ ప్రసాద్, సంగీతం: గోవింద్ వసంత, గీత రచయితలు: అనంత శ్రీరామ్, కవి సిద్ధార్థ, కథ: సాయి కిరణ్ రెడ్డి దైదా, కవి సిద్ధార్థ, కళా దర్శకుడు: రాజీవ్ నాయర్, యాక్షన్: జాషువా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ వర్మ వేగేశ్న, లైన్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ పెన్మచ్చ, సహ నిర్మాతలు: సంజయ్ సాంబ్రాణి, వీవీఎన్ ప్రసాద్, నిర్మాతలు: యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా.
ఆసక్తికర పొలిటికల్ డ్రామాతో ‘లెగసీ’
- Advertisement -
- Advertisement -



