-కేంద్రానికి అభినందనలు
-పునవిభజన సమస్యలు పరిష్కారించాలి :మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పాటుకు చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. ఏపీ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మంత్రి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పున:విభజన చట్టం 2014లో తెలంగాణకు పలు కీలక హామీలు ఉన్నాయనీ, వాటి అమలు విషయంలో కేంద్రం చొరవచూపడం లేదన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా వంటి ముఖ్య ప్రాజెక్టులు ఇంకా ఆచరణకు నోచుకోలేదన్నారు ఇవి తెలంగాణ అభివద్ధికి కీలకమని ఆయన గుర్తుచేశారు. అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి ప్రత్యేక నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహాకాలు వంటి అంశాల్లో కూడా కేంద్రం మాట తప్పిందని ఆరోపించారు. ఒక రాష్ట్రానికి చట్టబద్ధతతో ముందుకు తీసుకెళ్లే చర్యలు తీసుకుంటూ, మరో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను విస్మరించడం సరైంది కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు.
అమరావతికి చట్టబద్దత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



