లౌకిక భారతదేశాన్ని కాపాడుకుందాం : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రపంచ దేశాలపై బందిపోటుగా మారిన అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించాలని సీఐటీయూ అధ్యక్షకార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ అన్నారు. సోమవారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ”సంకల్ప యాత్ర” నిర్వహించారు. సంగారెడ్డిలోని పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ ఎదుట ఉన్న దొడ్డి కొమురయ్య విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగత్ సింగ్ కోరుకున్న సమసమాజం కోసం కార్మికులు, యువత పోరాడాలని పిలుపునిచ్చారు. లౌకిక భారతదేశాన్ని కాపాడుకునేందుకు మతోన్మాద శక్తులను పెకిలిద్దామని పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకలు, వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు.



