Monday, June 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసుగుణమ్మ ఆశయ సాధనకు కృషి చేద్దాం

సుగుణమ్మ ఆశయ సాధనకు కృషి చేద్దాం

- Advertisement -

– ఉభయ కమ్యూనిస్టు పార్టీల విలీనం ఆమె కాంక్ష : సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి
– తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు శాకమూరి సుగుణమ్మ సంస్మరణ సభ
– హాజరైన వామపక్ష పార్టీల నేతలు
నవతెలంగాణ-మియాపూర్‌

సాయుధ పోరాట యోధురాలు సుగుణమ్మ ఆశయ సాధనకు కృషి చేద్దామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి అన్నారు. ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు.. అణగారిన వర్గాలకు ప్రాణం పోసేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల విలీనాన్ని ఆమె కాంక్షించిందని పలువురు వక్తలు అన్నారు. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌.. ఇంద్రజిత్‌ గుప్తా హాల్‌లో ప్రముఖ కమ్యూనిస్టు నేత శాకమూరి సుగుణమ్మ సంస్మరణ సభ ఆదివారం జరిగింది. ఈ సభలో సీఆర్‌ ఫౌండేషన్‌ గౌరవ అధ్యక్షులు, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి మాట్లాడారు. పోరాట యోధురాలైన సుగుణమ్మ మరణం మహిళా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. సుగుణమ్మ తన చివరి ఊపిరి ఉన్నంత వరకూ ప్రజల కోసం పని చేశారని గుర్తుచేశారు. సమాజం మనకు ఏం ఇచ్చిందనే భావనతో కాకుండా మనం సమాజానికి ఏం చేశామనే ఆలోచనతోనే ఆమె ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ఉద్యమాలను ఎలా చేయాలో రాబోయే తరాలకు సుగుణమ్మ బాట వేశారన్నారు. ఆమె జీవితం మొత్తం కమ్యూనిస్టు ఉద్యమాల తోనే ముడిపడిందన్నారు. భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన సుగుణమ్మ.. ఆమె భర్త ఎస్‌వీకే ప్రసాద్‌కు తోడుగా ఉద్యమంలో పాల్గొన్నారని, కమ్యూనిస్టులు ఏకం కావాలన్నదే ఆమె చివరి కోరిక అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైౖర్మెన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలవాలని ప్రజలు బలంగా కోరుతున్నారని, సుగుణమ్మ కోరిక కూడా అదేనని అన్నారు. కర్రగుట్ట, చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు లను కేంద్ర ప్రభుత్వం ఊచకోత కోస్తుంటే ఎందుకు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని, తుపాకీతో కేంద్రాన్ని పడగొట్టే సత్తా ఉందా అనేది ఆలోచించాలన్నారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి నేదునూరి జ్యోతి, సుగుణమ్మ కూతురు డాక్టర్‌ శాకమూరి శోభ, కుమారులు డాక్టర్‌ శాకమూరి రవి, శాకమూరి రమేష్‌, సుగుణమ్మ సంరక్షకులు జిలానీ తదితరులు సుగుణమ్మ ఉద్యమ చరిత్రను గుర్తు చేశారు. ఆమె ఆశయాల సాధన కోసం మునుముందు ఉద్యమాలను బలోపేతం చేస్తామన్నారు. అంతకుముందు సుగుణమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్‌, సీనియర్‌ నాయకులు డాక్టర్‌ బీవీ విజయలక్ష్మి, సీఆర్‌ ఫౌండేషన్‌ మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్‌ జె.కల్పన, ఎన్‌ఆర్‌ఆర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డా|| టి. సురేష్‌, సభ్యులు కె.జ్యోష్నా, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందిర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -