ప్రఖ్యాత ‘మోనాష్’ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, సస్టైనబుల్ ఇంజనీరింగ్, క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ తదితర రంగాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని మెల్బోర్న్లోని ప్రఖ్యాత ‘మోనాష్’ యూనివర్సిటీ ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఇక్కడి ప్రముఖ విద్యా సంస్థలను భాగస్వామ్యం చేస్తూ జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు, ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఎక్స్ఛేంజ్లు, కో-ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్ను చేపట్టాలని కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం మెల్బోర్న్లోని ప్రఖ్యాత ‘మోనాష్’ యూనివర్సిటీని సందర్శించారు. అనంతరం ఉమ్మడి పరిశోధన, ఇన్నోవేషన్ బేస్డ్ కొలాబరేషన్, అకడమిక్ ఎక్స్ఛేంజ్ , స్టార్టప్ల భాగస్వామ్యం తదితర అంశాలపై యూనివర్సిటీ ప్రతినిధులతో చర్చించారు.
అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటం కంప్యూటింగ్, తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్, టీ హబ్, టీ వర్క్స్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో వినూత్న ఆవిష్కరణలు, పరిశోధనలకు ఈ భాగస్వామ్యం మరింత ఊతమిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ”గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్” మారేందుకు అవసరమైన ఎకో సిస్టం కలిగిన తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ వైస్-ప్రోవోస్ట్ ప్రొఫెసర్ మ్యాథ్యూ గిలెస్పీ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి పరిశోధనలు, సంయుక్త ప్రాజెక్టులను చేపట్టేందుకు వీలుగా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీన్ రీసెర్చ్ ప్రొఫెసర్ లే హై వూ, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ థామ్సన్ తదితరులు పాల్గొన్నారు.



