Friday, June 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఇక బడికి పోదాం…

ఇక బడికి పోదాం…

- Advertisement -

సెలవులకు బైబై…చదువులకు హారుహారు
నేటినుంచి పాఠశాలలు పున:ప్రారంభం
సమస్యలతో సర్కారు స్కూళ్లు సతమతం
పూర్తి కాని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పనులు
స్వచ్ఛ కార్మికుల నియామకం ఎప్పుడో…
విద్యాశాఖ సీఎం వద్దే ఉన్నా సమీక్ష కరువు
డైరెక్టర్‌ బదిలీ అయినా కొత్త వారిని నియమించని ప్రభుత్వం

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు పాఠశాలలు గురువారం నుంచి పున:ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 24 నుంచి బుధవారం వరకు పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. బుధవారంతో సెలవులు ముగిశాయి. ఇక ఆటపాటలు, అల్లరి చేష్టలకు బైబై చెప్పి చదువులకు హారుహారు అని చెప్పాల్సిన సమయం వచ్చింది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గురువారం ఉదయం తొమ్మిది గంటలకే బడిగంట మోగనుంది. ఇక పిల్లలంతా బడికి పోదాం చలో అంటారు. రాష్ట్రంలో ఈనెల ఆరో తేదీ నుంచి జయశంకర్‌ బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. ఈనెల 19 వరకు కొనసాగుతుంది. బడిఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా సాగుతున్నది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభిస్తామని చెప్పింది. బుధవారం 210 ప్రభుత్వ బడుల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. మిగిలిన పాఠశాలల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. అధిక ఫీజులతో తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. ఈ జిల్లాల్లోని ప్రభుత్వ బడుల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించకపోవడం గమనార్హం. ఇంకోవైపు రాష్ట్రంలోని సర్కారు బడులు సమస్యలతో సతమతమవుతున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టినా ఇంకా పూర్తి కాలేదని తెలుస్తున్నది. స్వచ్ఛ కార్మికులను ఇంకా నియామకం చేయలేదు. దీంతో సర్కారు బడులు సమస్యలతో స్వాగతమిస్తున్నాయి. మరోవైపు విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే ఉన్నది. బడులు ప్రారంభమవుతున్న కీలక సమయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించలేదు. ప్రత్యేకంగా మంత్రి లేకపోవడంతో పర్యవేక్షణ కరువైంది. విద్యాశాఖ అధికారులకు తగిన ఆదేశాలు వెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కీలకమైన పాఠశాల విద్యాశాఖకు సంచాలకులుగా ఉన్న ఈవి నరసింహారెడ్డి బదిలీ అయ్యారు. కొత్త అధికారిని నియమించకపోవడంతో ఆయన పేరుతోనే ఉత్తర్వులు, ఇతర ఆదేశాలు వస్తున్నాయి. వెంటనే కొత్త డైరెక్టర్‌ను నియమించాలన్న డిమాండ్‌ వస్తున్నది. ఇక పాఠశాల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫారాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 90 శాతం వరకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు పాఠశాలలకు చేరినట్టు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఒక జత యూనిఫారాలను వెంటనే ఇవ్వాలనీ, రెండో జత జులై చివరి నాటికి ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్టు వివరించారు.
పనుల్లో జాప్యం
కరీంనగర్‌ జిల్లా నారాయణపూర్‌ హైస్కూల్‌, కోనరావుపేట మండలం కొలనూర్‌ హైస్కూల్‌ వంటి చోట్ల విద్యార్థులు గతేడాది ఆరుబయట చెట్ల కిందే పాఠాలు వినాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితిలో ఏ మార్పూ లేదు. శంకరపట్నం మండలం వంకాయగూడెం పాఠశాల ఆవరణ అస్తవ్యస్తంగా మారింది. ఒకే చోట ప్రైమరీ స్కూల్‌, అంగన్‌వాడీ పాఠశాల, వాటర్‌ ట్యాంక్‌ ఉండగా, ట్యాంక్‌ నిండిపోయి స్కూల్‌ మైదానంలోకి నీరు చేరి పాకుడుతో కూరుకుపోయింది. జిల్లాలో పాఠశాలల్లో రూ.14.19 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటివరకు 50 శాతం కూడా పూర్తి కాలేదు. ప్రధానంగా విద్యుత్‌ సౌకర్యం, తాగునీరు, భవన మరమ్మతులు, కొత్త తరగతి గదుల నిర్మాణం, డైనింగ్‌హాల్‌, ప్రహరీ, మధ్యాహ్నభోజన వంట గదులు, మూత్రశాలలు, పెయింటింగ్‌ ఇలా అన్ని రకాల పనులు 228 చొప్పున ఆయా పాఠశాలల్లో చేయాల్సి ఉంది. ఇందులో ఒక్కో పని 50 శాతం మాత్రమే పూర్తయింది. ప్రధానంగా మూత్రశాలలు 228 పాఠశాలల్లో నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 65 పాఠశాలల్లోనే పూర్తయ్యాయి. 26 పాఠశాలల్లో ప్రోగ్రెస్‌లో ఉండగా.. 125 పాఠశాలల్లో పనుల టెండర్‌ కూడా వేయలేదు. టెండర్‌ వేసిన వాటిలో 12 పాఠశాలల్లో పనులు ప్రారంభించలేదు. ఇదే పరిస్థితి మిగతా జిల్లాల్లోనూ ఉంది. జగిత్యాల జిల్లాలో 788 పాఠశాలల్లో రూ.31.49 కోట్లతో పనులు గుర్తించినా, ఇంకా పనులు పూర్తి కాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 283 పాఠశాలలకు గాను 210 బడుల్లో పనులు పూర్తిచేసినట్టు అధికారులు చెబుతున్నా, కొన్ని చోట్ల ఇంకా పనులు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. కాంట్రాక్టర్‌కు రూ.3 లక్షలు మాత్రమే చెల్లించడంతో పనులు నిలిచిపోయాయి. సర్పంచ్‌ లింగం మాట్లాడుతూ.. రికార్డుల్లో సగం అంచనానే వేయడంతో పనులు చేయడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌ జిల్లావ్యాప్తంగా 95 శాతం యూనిఫారాలుత కుట్టడం పూర్తయిందని అధికారులు చెప్తున్నారు. కానీ, ఇంకా పాఠశాలలకు చేరలేదు. జిల్లాలో 438 పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాల పథకానికి ఎంపిక అయ్యాయి. ఇందులో 403 పాఠశాలలు పనులు పూర్తి చేసినట్టు సమాచారం.
సూర్యాపేటలోనూ ఇదే పరిస్థితి
విద్యార్థులు చదువుల్లో రాణిస్తున్నప్పటికీ నేటికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, శిథిలావస్థకు చేరిన భవనాలు, మూత్రశాలలు, మంచినీటి వసతి లేని పరిస్థితులు, వంటగదుల కొరత, ఎంఈవో పోస్టుల ఖాళీలు అన్నీ కలిసికట్టుగా ప్రభుత్వ విద్యారంగాన్ని కుంగదీస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలు 348, ప్రాథమికోన్నత పాఠశాలలు 76, ఉన్నత పాఠశాలల్లోని 163 తరగతి గదులకు మరమ్మతులు చేయాల్సి ఉంది. అదేవిధంగా 86 ప్రాథమిక పాఠశాలలు, 24 ప్రాథమికోన్నత, 75 ఉన్నత పాఠశాలలో మురుగు దొడ్లు శిథిలావస్థలో ఉన్నాయి. దాదాపుగా మొత్తంగా 400 పాఠశాలలో మంచినీటి వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయుల అవసరం ఉన్నప్పటికీ విద్యాధికారులు వాటిని భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు ఇంకా పాఠశాలలకు చేరలేదు. కొన్ని వచ్చినా మండల రిసోర్స్‌ కేంద్రాలకే పరిమితమయ్యాయి. ఉపాధ్యాయుల కొరత కూడా పాఠశాలలను వేధిస్తున్నది. కరీంనగర్‌ జిల్లాలో 492 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో 50 శాతం ఉపాధ్యాయులు కూడా లేరు. భూపాలపల్లి జిల్లా 1,49,133 పుస్తకాలు అవసరం ఉండగా.. 1,45,380 పుస్తకాలు మండలాలకు పంపించారు. ఇప్పటికే 97 శాతం పుస్తకాలు చేరుకున్నాయి.
అసంపూర్ణంగా ‘అమ్మ ఆదర్శం’
పాఠశాలలు గురువారం తెరుచుకుంటున్నాయి. సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల భవనాల పరిస్థితి దయనీయంగా ఉన్నది. గత ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల’ పేరిట మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. ఆచరణలో దాని పురోగతి అంతంత మాత్రంగానే ఉన్నది. రేకులు పగిలి.. స్లాబులు నెర్రెలుబారి, పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఫ్యాన్లు ఉన్నా పనిచేయడం లేదు. తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. వాటిని విద్యార్థులు వినియోగించే పరిస్థితి లేదు. వంటశాలల పరిస్థితి అధ్వానంగా ఉంది. దాంతోపాటు పాఠ్యపుస్తకాలు కూడా అన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో చేరలేదు. సమస్యలతోనే విద్యార్థులు కొత్త విద్యాసంవత్సరం ప్రారంభించాల్సి వస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -