Thursday, May 29, 2025
Homeరాష్ట్రీయంకేయూను మరింత బలోపేతం చేద్దాం

కేయూను మరింత బలోపేతం చేద్దాం

- Advertisement -

– జూలై 7న 23వ స్నాతకోత్సవ నిర్వహణ
– ఆగస్టు 19వ తేదీ నుంచి విశ్వవిద్యాలయం గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు : కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా

ఐక్యతతో కాకతీయ యూనివర్సిటీని మరింత బలోపేతం చేద్దామని వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లాలోని కేయూ(కాకతీయ విశ్వవిద్యాలయం) సెనెట్‌ హాల్‌లో రిజిస్ట్రార్‌ ఆచార్య వి రామచంద్రంతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోనే అన్ని యూనివర్సిటీల కంటే ముందుగా డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. ప్రాంగణ నియామకాలు చేపట్టామని అన్నారు. యూనివర్సిటీ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి సహకారంతో రూ.98 కోట్ల నుంచి రూ.144 కోట్లకు పెంచినట్టు తెలిపారు. అలాగే రూ.50 కోట్లు అభివృద్ధి గ్రాంట్‌ కూడా బడ్జెట్‌లో పొందిపర్చినట్టు చెప్పారు. దీనిని పూర్తిగా మౌలిక వసతులకు, అకాడమిక్‌ నిర్వహణకు ఖర్చు చేస్తామన్నారు. విశ్వవిద్యాలయంలో కే హబ్‌ నిర్వహణ తీసుకొస్తామని అన్నారు. 5 రీసెర్చ్‌ సెంటర్లు, వ్యక్తిగత ప్రాజెక్ట్స్‌, 65మంది ప్రాజెక్ట్‌ ఫెల్లోషిప్‌లకు అవకాశం వచ్చిందన్నారు. ఇంజనీరింగ్‌, ఫార్మసీలో స్కిల్ల్స్‌ ఆధారిత కోర్స్‌లను ప్రారంభిస్తామని తెలిపారు. జీవ నైపుణ్యాలు, భాషా నైపుణ్యాలు పెంచే దిశగా సెల్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఆగస్టు 19వ తేదీ నుంచి నిర్వహించనున్న విశ్వవిద్యాలయం గోల్డెన్‌ జూబ్లీ సందర్భంగా 3 రోజుల తెలంగాణా సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్నామని అన్నారు. దీనికి గుర్తుగా స్వర్ణోత్సవ అకాడమిక్‌ బిల్డింగ్‌ను, యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ శతాబ్దిలోనికి అడుగుపెడుతున్న సందర్భంగా సెంటినరీ బిల్డింగ్‌, అకాడమిక్‌ బ్లాక్‌ స్థాపనకు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు అందించినట్టు తెలిపారు. మహిళా ఇంజనీరింగ్‌ కాలేజీ అకాడమిక్‌ బ్లాక్‌, హాస్టల్‌, కామన్‌ మెస్‌, ట్రైబల్‌ విద్యార్థుల కోసం ఒకటి బాలుర, ఒకటి బాలికల వసతి గృహాల కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సంబంధిత అధికారుల నుంచి వచ్చిన నివేదికల స్వీకరణ అనంతరం, పాలక మండలి నిర్ణయం మేరకు ప్రహరీ చేపడుతామన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి కోసం న్యాస్కం(నేషనల్‌ అసోసియేషన్‌ అఫ్‌ సాఫ్ట్వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌-నస్స్కమ్‌), ఐట్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. పీవీ విజ్ఞాన పీఠంను ప్రారంభించి సామాజిక, ఆర్థిక పురోగతి పరిశోధనల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. విద్యార్థుల సౌకర్యార్ధం ఒక మేల్‌ మెడికల్‌ ఆఫీసర్‌, ఒక ఫిమేల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ను, విశ్వవిద్యాలయ ఆరోగ్య కేంద్రంలో నియమించినట్టు చెప్పారు. జులై 7న 23వ స్నాతకోత్సవ నిర్వహణకు రాష్ట్ర గవర్నర్‌, విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌ జిష్ణు దేవ్‌ వర్మ అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. 573 గోల్డ్‌మెడల్స్‌, 546 పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేయనున్నారని తెలిపారు. హైదరాబాద్‌, ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ అఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సంచాలకులు ముఖ్య అతిధిగా హాజరవుతున్నట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -