Saturday, May 31, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసర్కార్‌ బడులను రక్షించుకుందాం

సర్కార్‌ బడులను రక్షించుకుందాం

- Advertisement -

– ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చేర్పిద్దాం
– వీటిలోనే విద్యార్థుల సమగ్ర వికాసం : టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి
– బడిబాట ప్రచార జాతా ప్రారంభం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదలకు టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తం గా నిర్వహిస్తున్న ‘బడి బాట ప్రచార జాతా’ సోమవారం పలు జిల్లాల్లో ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాతాను స్థానిక వైరా రోడ్‌లో సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం ఉన్నాయన్నారు. అందుకే తల్లిదండ్రు లు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌ బుక్కులు, ఏకరూప దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తారని చెప్పారు. వీటితోపాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు, రాగిజావ వంటి పౌష్టికాహారం అందిస్తున్నారని వివరించారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతాయని, గుడి, మసీదు, చర్చిల నిర్మాణం కోసం ఐకమత్యంగా కదిలే ప్రజలు ఊరి బడి కోసం కూడా ఏకమవ్వాలని కోరారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని.. టీఎస్‌ యూటీఎఫ్‌ శ్రేణులు సోమవారం నుంచి పది రోజుల పాటు ప్రచారం నిర్వహిస్తాయని ప్రకటించారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన, ఉచిత పరీక్షలు నిర్వహిస్తారని, అత్యున్నత విద్యార్హతలు కలిగిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రులకు వివరిస్తామని చెప్పారు. తల్లిదండ్రుల ఆకాంక్షను ప్రయివేటు విద్యా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. చదువుల నాణ్యతలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. సంపాదనలో సగానికిపైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టమని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనా ఉందని అన్నారు. ‘మన ఊరు – మనబడి’, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతుల కల్పన మెరుగైందని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. ఏఐ ఆధారిత బోధన, డిజిటల్‌ తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబరేటరీలతో పాటు ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందిస్తున్నట్టు తెలిపారు. పిల్లల మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసానికి అనువుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు. బడికి అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్పనిసరిగా బడి నిలబడుతుందని తెలిపారు. ఖమ్మంలోని వైరా రోడ్డు, పాత బస్టాండ్‌, కొత్త బస్టాండ్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, ఇల్లందు క్రాస్‌ రోడ్డు ఏరియాల్లో తొలిరోజు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార జాతాలో సంఘం జిల్లా అధ్యక్షులు రంజాన్‌, ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు జీవీ నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, బాణోత్‌ రాందాస్‌, లివిన్‌ స్టన్‌, ధర్మసోత్‌ నాగేశ్వరరావు, పినపాక సురేష్‌, కట్టా పద్మ, వి.దామోదర్‌, ఉద్దండ్‌, మంగీలాల్‌, నెల్లూరి వీరబాబు, ఏడునూతల.రవికుమార్‌, జి.భిక్షపతి, యు.నాగేశ్వరరావు, డి.శ్రీనివాస్‌, శివకోటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -