భూమండలంలో మనిషి తన జీవితకాలంలో ఏదో సందర్భాన రోగాల బారిన పడటం నిజం. ఆ రోగాలు నయం కావడానికి ఔషధాలు అత్యంత కీలకం. వాటిని తయారుచేసే నిపుణుడే ఫార్మసిస్ట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామియైన ఇంటర్నేషనల్ ఫార్మసూటికల్ ఫెడరేషన్ (ఎఫ్.ఐ.పి )వ్యవస్థపాక దినోత్సవం 25 సెప్టెంబర్, 2009నుండి ప్రతిఏడాది ప్రపంచ ఫార్మసిస్ట్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈసారి ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడం (ఫార్మసీని బలోపేతం చేయడం, ఆరోగ్య వ్యవస్థలు) అనే థీమ్ను తీసుకున్నారు. అయితే, రోజురోజుకూ పెరిగిపోతున్న కొత్త కొత్త రోగాలు, వ్యాప్తి చెందుతున్న వైరస్లను దృష్టిలో పెట్టుకుని నూతన ఔషధాలు తయారు చేయడం, నివారణ మార్గాలను కనుగొనడంలో ఫార్మసిస్ట్స్ పాత్ర కీలకమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే, ఔషధ తయారీ, వాటి నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించడం, వ్యాధిగ్రస్తులకు మంచి మందులు వినియోగం పట్ల తగు సూచనలు, సలహాలివ్వడం, వాటి దుష్ఫలితాల పట్ల అవగాహన కల్పించడంలో వీరి పాత్ర వెలకట్టలేనిది. ఫార్మసిస్టు రోగికి డాక్టర్కు మధ్య వారధి. వ్యాధిని గుర్తించి తగిన మందులు సూచించేవాడు వైద్యుడు. ఔషధ ఎంపిక, మోతాదు వినియోగం సమస్తం అవగాహన కల్పించేది ఫార్మసిస్ట్ మాత్రమే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ లేనప్పుడు పేషెంట్కు ట్రీట్మెంట్ చేసేది ఫార్మసిస్ట్నే అని శంకర్రావు చౌహన్ పార్లమెంట్ సబ్ కమిటీ సూచించింది.
కోవిడ్-19 ప్రపంచాన్ని ఏ విధంగా కుదిపేసిందో అందరికీ తెలిసిందే.
ఆ సమయాన కోట్లాది ప్రజలు తమ ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని భయబ్రాంతులకు లోనయ్యారు. లక్షలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కరోనాకు వ్యాక్సిన్స్ తయారుచేసి కోట్లాదిమంది ప్రజల ప్రాణాలను కాపాడినవారు ఫార్మసిస్టులనేది జగమెరిగిన సత్యం. ఫార్మసిస్టుల పర్యవేక్షణలోనే మందులు పంపిణీ చేయాలని చట్టమున్నా అది అమలుకు నోచుకోవడం లేదు. కేంద్ర ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య విధానం-2017 ఫార్మసిస్టుల విశిష్టతను గుర్తించింది. అజిత్ ప్రసాద్ జైన్ అధ్యక్షతన ఏర్పాటైన స్టడీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కమిటీ చిన్నపాటి వైద్యశాలలో కూడా ముగ్గురు ఫార్మసిస్ట్లు ఉండాలని 1966లోనే సిఫారసు చేసింది.కానీ ఎక్కడా ఆ నియమాకాలను చేసిందిలేదు.అభివృద్ధి చెందిన దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్,ఇటలీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ దేశాలు, సౌదీ అరేబియా దేశాల్లో ఫార్మసిస్టులకు పెద్దపీట వేస్తున్నారు. ఆయా దేశాల వైద్యులు పరీక్షల అనంతరం వ్యాధిని గుర్తించి ఆ వ్యాధికి ఫలానా మందు అని నిర్ధారణ చేస్తారు.ఆ వ్యాధికి ఏ ఔషధం సరిపోతుందో, అది ఏ సమయాన, ఎంత మోతాదు లో, ఏ విధంగా వినియోగించాలో ఫార్మసిస్ట్ మాత్రమే రోగికి సూచిస్తాడు. కొన్ని యూరప్ దేశాల్లో వ్యాధిని గుర్తించి ఔషధాన్ని సిఫారసు చేసే అధికారం ఫార్మసిస్టు మాత్రమే ఉంది. కానీ, ఫార్మసిస్టులకు మన దేశంలో సరైన గుర్తింపు ఇవ్వకపోగా, వారి సేవలను నియోగించుకోవడం లేదు. దీంతో పేద ప్రజలకు సరైన వైద్యమందక ప్రతియేటా లక్షలాది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఫార్మసిస్టులకు ప్రభుత్వం సరైన గుర్తింపు నివ్వడం లేదు.అతి తక్కువ వేతనా లిచ్చి ఫార్మసిస్ట్స్తో పని చేయించుకుంటున్నది. పైగా ఫార్మసిస్ట్స్కు సరైన ప్రమోషన్స్ కూడా లేవు. 1985లో జనాభా ప్రాతిపదికన ఫార్మసిస్టుల నియామకం చేపట్టగా, అప్పటినుండి ఇప్పటివరకు జనాభా పెరిగినా కూడా కొత్త నియామకాలు లేవు. నలభై ఏండ్ల క్రితం ఉన్న మాదిరిగానే ఇప్పుడు కూడా ఒక్క ఫార్మసిస్టు చేతనే పని చేయించుకుంటున్నారు. దీంతో వారిపై విపరీతమైన పని భారం పెరిగి మానసిక ఒత్తిడికి లోనవు తున్నారు. అలాగే ఫార్మసిస్టులకు గత 35 ఏండ్లుగా ప్రతీ పి.ఆర్.సిలో వేతనాలు కూడా తగ్గుతూ వస్తున్నవి. ఫార్మసిస్టు బ్రాంచ్ వన్ మెడికల్ పరిధిలోకి వస్తారు. కానీ ప్రభుత్వాలు పారామెడికల్ కింద చూపించడం వల్ల వైద్యరంగంలో వారి పాత్రను తక్కువ చేసింది. ఇన్ సర్వీసు ఫార్మ సిస్టులకు డ్రగ్ ఇన్స్పెక్టర్, డ్రగ్ అనలిస్ట్, డైటీషియన్ పోస్టులలో 30శాతం కోటా కేటాయించాలి. ఆర్.బియస్కే, 104, యూపిహెచ్సి, యన్హెచ్యం, ఇతర అన్ని స్కీమ్లు, ఇతర ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న ఫార్మసిస్టులు అందరికీ సుప్రీంకోర్టు ఆదేశాను సారం సమాన పనికి సమాన వేతనమివ్వాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఫార్మసిస్టులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలి. ప్రతి జిల్లా కార్యాలయంలో ఫార్మసీ సూపర్వైజర్ పోస్ట్, ఫార్మసిస్ట్ గ్రేడ్2 పోస్టులు వెంటనే మంజూరు చేయాలి. అన్ని బస్తీ, పల్లె దవాఖానాల్లో ఫార్మసిస్టులను నియమించాలి.
బత్తిని సుదర్శన్ గౌడ్, 9849086033