Tuesday, June 17, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిగాలిలో దీపాలు

గాలిలో దీపాలు

- Advertisement -

”అంతా కొన్ని సెకన్లలో జరిగిపోయింది. నా చుట్టుపక్కల ఉన్నవారందరూ చనిపోయారు… చనిపోతున్నారు. నేనెలా తప్పించుకో గలిగానో తెలియట్లేదు.” దేశంలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడిన వారి భయంకర అనుభవాలు చెబుతున్న మాటలివి! ఒక ప్రమాదం నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం దేశాన్ని కలవర పెడుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి చోటుచేసుకున్న ప్రమాదాలన్నీ ఒళ్ళు జలదరింపచేసే భయానక ఘటనలే. ఆ పెనువిషాదాలు గుండెలను నలిపేస్తున్నాయి. మహారాష్ట్ర రైలు ప్రమాదం, మహాకుంభమేళాలో వరుస తొక్కిసలాటలతో ప్రారంభమైన ఈ ఏడాది విషాదాలను నింపుతూనే వుంది. వీటన్నింటికి ప్రధాన కారణం నిర్లక్ష్యమే. గత ప్రమాదాల నుంచి పాఠాలు నేర్వని ప్రభుత్వాలది… ప్రయివేటు సంస్థలదీ నిర్లక్ష్యం. కేవలం సంపాదన యావ తప్ప సామాన్యుల ప్రాణాలంటే లెక్కలేనితనం ఈ ప్రమాదాలన్నిం టిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
‘జాతి ప్రతిష్ఠకు ప్రతీక’గా యాభై ఏండ్ల పాటు విశేష సేవలందించిన ఎయిర్‌ఇండియా అసమర్థ రాజకీయాలకు బలైంది. ఎయిర్‌ఇండియాను ప్రయి వేటుకు కట్టబెట్టి… ప్రజల ప్రాణాలను గాలిలో దీపాలు చేసింది మోడీ సర్కార్‌. అసలు ఎయిర్‌ ఇండియా ప్రమాదంలో అసువులు బాసిన వారి సంఖ్యే ఇప్పటికీ అంతు బట్టడం లేదు. చార్‌ ధామ్‌ యాత్ర మార్గంలో ఇటీవల కాలంలో హెలికా ప్టర్ల ప్రమాదాలు, అత్యవసర ల్యాండింగ్‌ ఘటనలు ఎక్కువగా చోటుచేసు కుంటున్నాయి. నిన్నటికి నిన్న కేదార్‌నాథ్‌ సమీపంలో హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. ఈ ఏడాదిలో ఇక్కడే ఇది ఐదో హెలికాప్టర్‌ ప్రమాదం. అయినా వీటి నుంచి పాఠాలు నేర్వకపోగా.. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రమాదాలకు గల కారణాలనూ అన్వేషించలేదు. దీని బట్టి ప్రజల ప్రాణాల పట్ల పాలకులకు ఎంత చులకన భావన ఉందో అర్థం చేసుకోవచ్చు.
రోడ్డు ప్రమాదాల్లోనూ ప్రాణాలు విడిచేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. దానికి తోడు విద్యుత్తు సంస్థ నిర్లక్ష్యంతో రోడ్లపై తీగలు కూడా తెగి పడి ప్రాణాలు తీస్తున్నాయి. అత్యవసర సేవల పేరుతో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా.. రోడ్‌ కాంగ్రెస్‌ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిగా రైట్‌ ఆఫ్‌ వే తీసుకుంటూ లైన్లను వేసిన ఫలితంగా తరచూ విద్యుత్తు ప్రమాదాలు చోటుచేసుకుం టున్నాయి. ప్రమాదవశాత్తూ ఎక్కడైనా తీగలు తెగిపడితే లైన్లు ట్రిప్పయి సరఫరా ఆగిపోవాలి. కానీ బ్రేకర్లు పనిచేయక విద్యుత్తు ప్రసరిస్తోంది. శనివారం అర్ధరాత్రి రాష్ట్ర రాజధాని నగర నడిరోడ్డుపై 33 కేవీ విద్యుత్తు తీగ తెగి అక్కడే నిద్రిస్తున్న యాచకులపై పడటంతో వారు సజీవ దాహనం అయ్యారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్లలో వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో భారీ విగ్రహాలను మరో చోటుకు తరలిస్తున్న క్రమంలో విగ్రహానికి 33 కేవీ విద్యుత్తు తీగ తగిలి ఇద్దరు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మొన్నటికి మొన్న చార్మినార్‌ దగ్గర జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో 26 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నా విద్యుత్‌ శాఖ తమకేం పట్టనట్లు వ్యవహరిస్తోంది. తత్‌ఫలితమే ఈ వరుస ప్రమాదాలు.
కుంభమేళాకు వెళ్లకపోతే మానవ జీవితం దండగన్న స్థాయికి ఫోబియాను ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం, యోగి సర్కారు కల్పించాయి. గోడీ మీడియాతో పాటు సంఫ్‌ు పరివారం సైతం రెచ్చిపోయింది. వరుస తొక్కిసలాటలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రమాదకర స్థాయికి చేరిన నీటి, గాలి కాలుష్యం ఇలా అన్నింటిని గమనిస్తే ప్రజల భద్రతకు, ఆరోగ్యానికి లవలేశమాత్రం కూడా బాధ్యత పట్టలేనితనం మన ప్రభుత్వాల్లో స్పష్టమవుతోంది. ఆదివారం బాసరలో గోదావరిలో పుణ్యస్నానాలకు వెళ్లిన ఐదుగురు, ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ఘటనలో ఆరుగురు జలసమాధి అయ్యారు. యాత్రికుల ప్రాణాలను హరించిన అన్ని దుర్ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను నిర్ధారించి శిక్షిస్తేనే భవిష్యత్తులో యాత్రికులకు కాస్తంత భరోసా సిద్ధిస్తుంది. కానీ, ఇలాంటి ఘటనలు జరిగి రోజులు, నెలలు గడుస్తున్నా డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ విచారణ చేపట్టకుండా తంతు ముగిసినట్టుగా చేతులు దులుపుకుంటోంది.
ప్రపంచంలోని మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 11శాతం మన దగ్గరే చోటుచేసుకుంటున్నాయి. దేశంలో ఏటా సుమారు అయిదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, వాటిలో లక్షన్నర మంది మరణిస్తున్నట్టు ఓ అంచనా. అయినా వీటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్న సోయి అటు ప్రభుత్వాలకు కానీ, వేలకువేలు ప్రయాణ చార్జీలు వసూళ్లు చేసే ప్రయివేటు సంస్థలకు కాని లేదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రమాదాల తరువాత పరామర్శలకు, పరిహారాల ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఈ నిర్లక్ష్యవైఖరిని వీడాలి. ”ప్రమాదాలు ఊహిస్తామా, కలగంటామా” అన్న బాధ్యతలేని వాదనలకు తావులేకుండా…ప్రమాదాలకు ఆస్కారం లేని రీతిలో అన్ని ఏర్పాట్లు చేసి…అడుగడుగునా ప్రజలను కనిపెట్టుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -