యథేచ్ఛగా వ్యర్థజలాల విక్రయం
పట్టించుకోని అధికారులు
పీసీబీ పరిశోధనలో వెల్లడి
సున్నం చెరువు నీటిని వాడొద్దు : హైడ్రా
నవతెలంగాణ-సిటీబ్యూరో
సంపాదనే ధ్యేయంగా పెట్టుకుంటున్న వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వారి అవసరాలను ఆసరా చేసుకుని వ్యర్థజలాలను సైతం విక్రయిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ పరిధిలోని సున్నం చెరువు పరిసరాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో కలుషితమయ్యాయని కాలుష్య నియంత్రణ మండలి పలుమార్లు హెచ్చరించినా వ్యాపారులు విచ్చలవిడిగా బోర్లు వేసి నీటిని తోడుతున్నారు. సమీపంలోని హాస్టళ్లు, వసతి గృహాలు, అపార్టుమెంట్లు, హాటళ్లు, విద్యాసంస్థలు, ఐటీసెక్టార్తోపాటు కావాల్సిన వారికి వాటిని ట్యాంకర్ల ద్వారా విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో యథేచ్ఛగా కొనసాగుతున్న నీటి వ్యాపారం ప్రజల ప్రాణం మీదకి తెస్తోంది. ఈ సమయంలో స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. సున్నం చెరువు నీటిని వాడొద్దని సూచించింది.
12 రెట్లు అధికం
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటిలో 0.01 మిల్లీగ్రాముల వరకూ సీసం ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ సున్నం చెరువు చుట్టూ ఉన్న బోరు నీటిలో 0.073 – 0.122మిల్లీగ్రాములు ఉన్నట్టు పీసీబీ గుర్తించింది. పిల్లల మెదడు చురుకుదనంపై ప్రభావం చూపడంతోపాటు, జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. రక్తహీనతకు కారణమవ్వడమే కాకుండా, బాల్యం, యవ్వన దశలోనే కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, సంతానోత్పత్తిపైనా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు.
2 నుంచి 3 రెట్లు అధికంగా కాడ్మియం
నీటిలో కాడ్మియం 0.003 మిల్లీగ్రాముల వరకు ఉన్నా పర్వాలేదని అంతర్జాతీయ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే, సున్నం చెరువు పరిసరాల్లోని బోరు నీళ్లలో ఇది 0.007 – 0.010 మిల్లీగ్రాములు ఉన్నట్టు తేలింది. కాడ్మియం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. మూత్రం ద్వారా ప్రొటీన్లు పోవడంతో ఎముకల బలహీనతకు దారి తీస్తుంది. క్యాన్సర్ వ్యాధికి కారణమౌతుందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వెల్లడించింది.
రెండు రెట్లు అధికంగా నికెల్
అదే విధంగా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం లీటరు నీటిలో 0.02 మిల్లీగ్రాముల మోతాదులో నికెల్ ఉంటే పర్వాలేదు. కానీ సున్నం చెరువు చెంత ఉన్న బోర్లలో 0.038-0.046 మిల్లీగ్రాములు అధికంగా ఉన్నట్టు తేలింది. నికెల్ ఎక్కువ ఉంటే చర్మ సంబంధిత వ్యాధులతోపాటు, కాలేయం దెబ్బతింటుంది. తద్వారా మూత్రపిండాలు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక ఒత్తిడికి గురై చిన్న వయసులోనే రక్తపోటుకు కూడా కారణమౌతుందని వైద్యులు చెబుతున్నారు.
మరగబెట్టినా వదలని కాలుష్యం
సహజంగా నీటిని మరగబెట్టి తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. కాలుష్య సాగరాల చెంత ఉన్న బోర్ల నుంచి వచ్చే నీటిని మరగబెట్టి వినియోగించినా ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నీటిలో క్రిములు నశించినా, సీసం, కాడ్మియం, నికెల్ వంటి భారీ లోహాలు కరగకపోగా, మరింత దగ్గరగా మారి ప్రమాదకరంగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సున్నం చెరువు సమీపంలో ఇదే పరిస్థితి ఉందని పీసీబీ పరిశోధనల ద్వారా వెల్లడైంది.
సున్నం చెరువుకు మొదటి ప్రాధాన్యం
ప్రమాదకర పరిస్థితుల్లో సున్నం చెరువు ఉందని గుర్తించిన హైడ్రా ఆ చెరువు పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యతనిచ్చింది. నగరంలో చేపడుతున్న ఆరు చెరువుల (మాదాపూర్లోని సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్లోని నల్లచెరువు, అంబర్పేట్లోని బతుకమ్మకుంట, పాతబస్తీలోని బమృక్ నుద్దౌలా చెరువు) పునరుద్ధరణలో సున్నం చెరువు ఉంది. శేరిలింగంపల్లి, కూకట్పల్లి మండలాల సరిహద్దులోని గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య సున్నం చెరువు 32.60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
ఈ చెరువును కాలుష్యం నుంచి కాపాడి, మంచి నీరు నిలిచేలా దాదాపు రూ.10కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు హైడ్రా తెలిపింది. నీటి వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించినట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలి పారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఎవరైనా కలుషిత నీటిని సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరిం చారు.
పీసీబీ ద్వారా
నీటి నాణ్యత పరీక్షలు
చెరువులను పునరుద్ధరించే క్రమంలో హైడ్రా సున్నం చెరువును పరిశీలించింది. ఇక్కడి భూగర్భ జలాలు ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో పీసీబీ ద్వారా పరీక్షించింది. ముఖ్యంగా తాగునీటిగా సరఫరా చేస్తున్న ట్యాంకర్లలోని నీటి నమూనాలపై అధ్యయనం చేయించింది. ఇక్కడి నీటిలో సీసం, కాడ్మియం, నికెల్ లోహాల మోతాదులు అధికంగా ఉన్నాయని వెల్లడైంది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ హెచ్చరించింది.