నవతెలంగాణ – హైదరాబాద్: కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా కర్ణాటకలో విడుదలకు లైన్ క్లియర్ అయింది. సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఉన్నందున, వివాదాలతో సంబంధం లేకుండా కర్ణాటకలో విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఈ రోజు స్పష్టం చేసింది. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కమల్ హాసన్ గతంలో కన్నడ భాషపై చేసిన కొన్ని వ్యాఖ్యలు (“కన్నడ తమిళం నుండే పుట్టింది”) వివాదాస్పదం కావడంతో, ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో విడుదల చేయనీయకుండా కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా సినిమాను నిషేధించాలని హెచ్చరించింది. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు కర్ణాటకలో ప్రదర్శనకు నోచుకోలేదు.
ఈ నేపథ్యంలో, సినిమా విడుదలకు భద్రత కల్పించడంలో విఫలమైనందుకు కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. “సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) అనుమతి పొందిన సినిమాను విడుదల చేయాల్సిందే. చట్టబద్ధమైన పాలన ఇదే చెబుతోంది,” అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని కర్ణాటక హైకోర్టు సూచించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. “జూన్ 3న హైకోర్టు కమల్ హాసన్ను క్షమాపణ చెప్పమని కోరడం సరికాదు,” అని పేర్కొంది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, కన్నడ భాష పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని కమల్ హాసన్ చెబుతున్నప్పటికీ, క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ఈ కేసును కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు తనకు బదిలీ చేసుకుంది. “రాష్ట్రాన్ని అల్లరి మూకలు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారి నియంత్రణలోకి వెళ్లనివ్వలేం” అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గత విచారణలో వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.