”అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు” అంటాడు శ్రీశ్రీ. అన్నట్లుగానే పల్లెమార్గాన కొండల్లో కోనల్లో, అడవుల్లో, పచ్చిక బయళ్లలో చెట్టూ పుట్టా పట్టుకు జీవాలను పెంచుకుంటూ, ప్రకృతిలో మమేకమై జీవనాన్ని సాగించే కురుమల సంస్కృతిపై చేసిన పరిశోధన ఇది. వారిని అంటిపెట్టుకుని కొనసాగిన కళ ఒగ్గు కథ, బీరప్పల గాథా విషయాలకు సంబంధించిన సాహిత్యం, కళా నిర్మాణం మాత్రమే కాక, కురుమల చరిత్రనూ తవ్విపోసిన రచన. ఒక సమూహపు సమగ్ర సాంస్కృతిక జీవనాన్ని వివరిస్తూనే చరిత్రనూ వివరిస్తారు. మరీ ముఖ్యంగా సాహిత్యాన్ని విశ్లేషించి మనకందించారు. గొర్రెల కాపరులు వ్యవసాయదారులుగా, గొంగళ్ల నేతగాళ్లుగా, అడవిలోని అనేక ఔషధ మొక్కల ఉపయోగాలను గుర్తించిన విజ్ఞాన జీవులు. నిత్య శ్రమైక జీవులు. పరిసరాల జ్ఞాన సంపన్నులు.
వారి పనులలో, జీవన పోరాటంలో సృష్టించుకున్న భాష సాహిత్యం, సంస్కృతి ఎంతో సజీవంగా వుంటుంది. పురాణ కథాంశాలు చేరి ఉండవచ్చు. పరిణామానికి లోనయి మారనూ వచ్చు. కానీ, ప్రజల, సామాన్యుల వాస్తవిక సారం అందులో కొనసాగుతుంది. ఒక సమూహపు జీవన గమనాల నుండి ఎలాంటి సంస్కృతి ఆలంబనగా కొనసాగిందో అర్థం చేసుకోవటానికి ఈ పరిశోధన ఉపయుక్తమవుతుంది. ఇదే కుదురుకు చెందిన బర్ల మహేందర్ గారు తమ మూలాలకు సంబంధించిన చరిత్రను, సంస్కృతిని, సాహిత్యాన్ని ఎంతో శ్రద్ధతో, ప్రేమతో పరిశోధన చేశాడు. ఒక పెద్ద సమూహపు సంస్కృతిని తెలుసుకోవడం సామాజికులంగా అవసరమని భావిస్తాను. మరీ ముఖ్యంగా ఆ సమూహం నుండి వచ్చిన నేటి తరానికి, చరిత్ర పరిశోధకులకు, సాహిత్య, సాంస్కృతిక అధ్యయనశీలురకు ఇది ఎంతో విలువైన గ్రంథంగా నిలుస్తుంది. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్లో లభిస్తుంది.
కె.ఆనందాచారి
99487 87660
సామాన్యుల సాహిత్యం, సంస్కృతి శోధన
- Advertisement -
- Advertisement -



