నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంపూర్ జిల్లా పహాడీ గేట్ కూడలి సమీపంలో ఆదివారం సాయంత్రం భారీ లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బొలెరో వాహనంపై బోల్తా కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. నైనిటాల్ రోడ్డులోని పహాడీ గేట్ వద్ద, స్థానిక పవర్ హౌస్ సమీపంలో బిలాస్పూర్ వైపు వెళ్తున్న గడ్డి లోడ్ లారీ మలుపు వద్ద రోడ్డుపై ఉన్న డివైడర్ను ఎక్కింది. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి పక్కనే వెళ్తున్న బొలెరోపై పడిపోయింది. ప్రమాద సమయంలో బొలెరోలో ఉన్న డ్రైవర్ ఫిరాసత్ (54) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుజర్టోలా గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదానికి గురైన బొలెరో విద్యుత్ శాఖ ఎస్డీఓకు సంబంధించినదిగా సమాచారం. అదే సమయంలో పక్కన వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు స్వల్ప తేడాతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్, ఫైర్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్రేన్ సాయంతో లారీని, బొలెరోను తొలగించి రహదారిని క్లియర్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.



