అమరావతి : కోవా బన్ ‘వలీ’కి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మద్దతు ప్రకటించారు. తెలంగాణలో జరిగిన మేడారం జాతరలో రూ.10లకే కోవా బన్ను అమ్ముతున్న వలీని ఒక యూబ్యూబర్ ప్రశ్నించడమే కాకుండా అతని మతాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. సమాజంలో విద్వేషాన్ని రగిల్చేలా ఆ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేయడంతో సోషల్ మీడియా భగ్గుమనడంతోపాటు పలువురు వలీకి మద్దతు నిలిచారు. ఇప్పుడు మంత్రి లోకేశ్ కూడా వలీకి మద్దతు ప్రకటించారు. ‘ప్రియమైన సోదరుడు వలీ మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోవాల్సి రావడం నాకు ఎంతో బాధగా ఉంది’ అని ఆదివారం సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. విభజనాత్మకమైన, సామాజిక విరోధాన్ని రెచ్చగొట్టే ప్రవర్తనకు తెలుగు సమాజంలో స్థానం లేదని తెలిపారు. మన సమాజం ఎప్పుడూ సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావానికి ప్రతీకగా నిలిచిందని వివరించారు. ‘నేను త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. మీ ప్రసిద్ధ కోవా బన్ రుచి చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు.



