Wednesday, October 22, 2025
E-PAPER
Homeబీజినెస్ఏడు బీఎండబ్ల్యూ కార్ల కొనుగోలుకు లోక్‌పాల్‌ టెండర్‌

ఏడు బీఎండబ్ల్యూ కార్ల కొనుగోలుకు లోక్‌పాల్‌ టెండర్‌

- Advertisement -

– వెల్లువెత్తుతున్న విమర్శలు
న్యూఢిల్లీ :
అవినీతిని నిర్మూలించే ఉద్దేశ్యంతో ఏర్పాటైన లోక్‌పాల్‌ ఏడు విలాసవంతమైన బీఎండబ్ల్యూ కార్ల కొనుగోలుకు టెండర్‌ను పిలవడం విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్షపార్టీలు, అవినీతి వ్యతిరేక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 16న జారీ చేసిన టెండర్‌లో భారత లోక్‌పాల్‌ కోసం ఏడు బీఎండబ్ల్యూ 3 సిరీస్‌ 330ఎల్‌ఐ కార్ల సరఫరా కోసం ప్రముఖ ఏజెన్సీల నుంచి ఓపెన్‌ టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. లాంగ్‌వీల్‌ బేస్‌, తెలుపు రంగులో ఉన్న ఎం స్పోర్ట్స్‌ మోడల్‌ కార్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం భారత లోక్‌పాల్‌లో చైర్మెన్‌, ఆరుగురు సభ్యులు ఉన్నారు. అంటే ఒక్కొరికీ ఒక్కొక్క బిఎండబ్ల్యూ కారు కోసం ఈ టెండరు జారీ చేసినట్టయింది. అలాగే లోక్‌పాల్‌ టెండర్‌ ప్రకారం ఎంపికైన సరఫరాదారులు లోక్‌పాల్‌ ఎంపిక చేసిన డ్రైవర్లు, నియమించిన సిబ్బందికి ఏడు రోజుల సమగ్ర ఆచరణాత్మక, సైద్ధాంతిక శిక్షణా కార్యాక్రమాన్ని నిర్వహించాలి. వాహనాలు డెలివరీ చేసిన 15 రోజుల్లోపు ఈ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని నియంత్రణలు, భద్రతా వ్యవస్థలతో పరిచయంతో పాటు ప్రతీ డ్రైవర్‌కు కనీసం 50 నుంచి 100 కీలోమీటర్ల ఆన్‌-రోడ్‌ ప్రాక్టీస్‌ను కవర్‌ చేయాల్సి ఉంటుందని కూడా లోక్‌పాల్‌ స్పష్టం చేసింది.
బిడ్లు దాఖలు చేయడానికి నవంబర్‌ 6ను చివరి తేదీగా పేర్కొన్నారు. అలాగే రూ. 10 లక్షల ముందస్తు డిపాజిట్‌ చేయాలి. ప్రతిపక్ష నాయకులు, అవినీతి వ్యతిరేక కార్యకర్తలు ఈ టెండర్‌ను తీవ్రంగా ఖండించారు. ఇది సంస్థ లక్ష్యాన్నే దెబ్బతీసే దుబారా ప్రదర్శనగా విమర్శించారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఇలాంటి టెండర్‌ లోక్‌పాల్‌ను బలహీన పరుస్తుందని అన్నారు. ‘అనేక ఏండ్లుగా లోక్‌పాల్‌ను ఖాళీగా ఉంచిన మోడీ ప్రభుత్వం ప్రస్తుతం లోక్‌పాల్‌లో విలాసాలతో మునిగి ఉన్న వ్యక్తులను సేవకులుగా నియమించింది. వారు ఇప్పుడు తమ కోసం 70ఎల్‌ బీఎండబ్ల్యూ కార్లను కొనుగోలు చేస్తున్నారు’ అని ప్రశాంత్‌ భూషణ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు సరళ్‌ పటేల్‌ ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఈ లోక్‌పాల్‌ గత 11 ఏండ్లలో ఒక్క కేసుపైనా చర్య తీసుకున్నారా.. అని ప్రశ్నించారు. లోక్‌పాల్‌ అవినీతిపై దర్యాప్తు చేయడానికి బదులుగా దుబారాకు పాల్పడుతున్నట్టుగా కనిపిస్తోందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -