వేలాది మంది ఏకమై ఎర్ర అలలా ఉప్పొంగిన ప్రదర్శన
ముంబై: వివిధ జీవనో పాధి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహా రాష్ట్రలో లాంగ్మార్చ్ కొనసాగుతోంది. అఖిల భారత కిసాన్ సభ, సీఐటీయూ నాయకత్వంలో రైతులు, కార్మికులు, వేలాది మంది ప్రజలతో ఈ మార్చ్ మంగళవారం రాజూర్ తాలూకా నుంచి ప్రారంభమైంది. 148 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి అకోల్, సంగమ్నేర్ మీదుగా అహల్యానగర్ కలెక్టరేట్కు చేరుకుంటుంది. అయితే లాంగ్మార్చ్ మార్గంలో ఉత్సాహభరితమైన స్వాగతం లభిస్తోంది, విద్యార్థులు, యువత సంఘీభావంగా పాల్గొంటున్నారు. నాసిక్-థానే-పాల్ఘర్ లాంగ్ మార్చ్లు , 2023 అకోల్లోని లాంగ్ మార్చ్ నుంచి ఆమోదించిన అభ్యర్థనలను అమలు చేయడం, అలాగే నాసిక్-పుణే హై-స్పీడ్ రైల్వేకు సంబంధించి ఇచ్చిన హామీలు ఈ మార్చ్లోని ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి.
లాంగ్ మార్చ్ సందర్భంగా.. అకోల్ తహశీల్దార్ కార్యాలయంలో మూడు గంటల పాటు చర్చ జరిగింది. అదనపు కలెక్టర్ బాలాసాహెబ్ కోలేకర్, జిల్లా పోలీస్ చీఫ్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఆమోదించబడిన డిమాండ్లను అమలు చేయడంపై జిల్లా అధికారులు అనుకూల వైఖరిని వ్యక్తం చేసినప్పటికీ, రాష్ట్ర స్థాయిలో డిమాండ్లు పరిష్కారం కాలేదు. సంబంధిత మంత్రులతో చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. ఒక నిర్ణయం వచ్చే వరకు కిసాన్ సభ, సీఐటీయూ, ఇతర సహాయక సంస్థలు నిరసనను కొనసాగించాలని నిర్ణయించాయి.



