నవతెలంగాణ – నసురుల్లాబాద్
మెదక్ నుంచి బోధన్ వరకు నూతన జాతీయ రహదారిపై నిర్మాణ పనులు జరిగే చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వివరించడంతో బాన్సువాడ నియోజకవర్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. శనివారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి విస్తీర్ణ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇరువైపులా రెండు, మూడు ఫీట్ల లోతు గుంతలు తవ్వారు. సూచిక బోర్డు లేకపోవడంతో లోడుతో ఉన్న ఓ లారీ గుంతలో పడింది. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇరువైపులా గుంతలు తవ్వడం వలన నిత్యం ఏదో ఒక చోట ద్విచక్ర వాహనదారులు గుంతలో పడి గాయాల పాలైతున్నారు. రేడియం స్టిక్కర్లు లేక రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. సంవత్సరం వ్యవధిలో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఏదో ఒక చోట రహదారి నిర్మాణం పనుల గుంతలో పడి గాయాలు పాలవుతున్నా.. అధికారులు, కాంట్రాక్టర్లు నిమ్మకు నీరత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తాం: శ్రీధర్ (ఎన్ హెచ్, అసిస్టెంట్ ఇంజనీర్)
పనులు జరిగే చోట, మూల మలుపులు, వేగ నియంత్రికల వద్ద సూచిక బోర్డులు కొన్ని చోట్ల ఏర్పాటు చేశాం. ఇప్పుడు మరోసారి ఏర్పాటు చేస్తాం. రాత్రి సమయంలో వాహనదారులకు కనబడేలా రేడియం స్టిక్కరింగ్ వేయిస్తాం. పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదాలు జరగకుండా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి.