– మూడుసార్లు పెంచినా నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
– దరఖాస్తుదారుల నుంచి స్పందన అంతంతే..
– ఫీజు చెల్లించింది రూ.60వేల లోపే..
– 30 శాతం మాత్రమే ముందుకొచ్చిన స్థల యజమానులు
– మరోసారి గడువు పెంపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎస్ఆర్ఎస్) కింద అనధికార లే ఔట్లలోని స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన 25 శాతం రాయితీ గడువు ముగిసినా ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా అనధికార లేఔట్లను క్రమబద్ధీకరించి, ఆదాయాన్ని పెంచుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. అధిక ఫీజులు, సంక్లిష్ట పరిశీలన ప్రక్రియ, ప్రజల్లో అవగాహన లేమి.. స్పందన తగ్గడానికి కారణాలుగా అధికారులు గుర్తిస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అంగీకారం తప్పనిసరి కావడంతోపాటు ఈ మూడు శాఖల ధ్రువీకరణ పూర్తయితేనే క్రమబద్ధీకరణ పత్రాలు జారీ అవుతుండటంతో ఆలస్యం, ఇబ్బందులు తప్పడం లేదు. మార్చి 31, ఏప్రిల్ 30, మే 3 వరకు మూడుసార్లు గడువు పొడిగించినా.. స్థల యజమానులు పెద్దగా ముందుకు రాలేదు.
2020లో రూ.వెయ్యి ఫీజుతో దరఖాస్తు చేసుకున్నవారి క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఫీజుపై రాయితీ కల్పించిన విషయం తెలిసిందే. గతంలో ఈ పథకం కింద 25.67లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 8 లక్షల దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదాయం పెంపు కోసం 25 శాతం రాయితీ ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రకటించిన వన్ టైమ్ సెటిల్మెంట్ గడువు మొదట మార్చి 31 వరకు ఉండగా, ఆ తర్వాత ఏప్రిల్, మే వరకు పొడిగించింది. తాజాగా ఈనెల(జూన్) 30 వరకు గడువు పెంచింది. ప్రారంభంలో స్పందన బాగుంది. ఆ తర్వాత లేదు. 20వేల కోట్ల ఆదాయం కోసం ప్రయత్నించగా, రూ.రెండు వేల కోట్లు మాత్రమే ప్రభుత్వానికి వచ్చింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 1,65,657 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1,15,612 దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 51 వేల మంది ఫీజు చెల్లించగా.. 11 వేలకు పైగా దరఖాస్తులు క్లియర్ అయ్యాయి. దీంతో దాదాపు రూ.271 కోట్ల వరకు జిల్లాలో ఆదాయం సమకూరగా.. కొత్తగా 1,904 దరఖాస్తులు వచ్చాయి.
ఇప్పట్టో తేలేది కష్టమే..!
ఎల్ఆర్ఎస్ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ కింద గత ప్రభుత్వ హయాంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, క్రమబద్ధీకరించాలని నిర్ణయించి, 2020 నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పించింది. దాదాపు 3 నెలలుగా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. క్రమబద్ధీకరణకు యోగ్యమైనవిగా అధికారులు నిర్ణయించిన దరఖాస్తుదారుల్లో ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే ప్లాట్ల దరఖాస్తులకు క్రమబద్ధీకరణ ఫీజులు చెల్లించగా.. మరో 70శాతం పెండింగ్లోనే ఉండటం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 1,65,657 దరఖాస్తులు రాగా.. అందులో 1,15,612 దరఖాస్తులు ప్లాట్ల క్రమబద్ధీకరణకు అర్హత ఉన్నవిగా తేల్చిన అధికారులు.. ఆ మేరకు సంబంధిత ప్లాట్ల యజమానులకు సమాచారం ఇచ్చారు. మీరు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఫీజులు చెల్లిస్తే.. ఈ ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు. అయినా ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన 2020 కటాఫ్ ఏడాది తర్వాత ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం తాజాగా ఈ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత మరో 1,904 దరఖాస్తులు కొత్తగా వచ్చాయి. వీటిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
రెండో స్థానంలో జిల్లా
ఫీజులు చెల్లించి, మిగిలిన పత్రాలు సరిగా జతచేయని వారి నుంచి అవసరమైన పత్రాల కోసం అధికారులు మళ్లీ సమాచారం ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు కూడా చేపడుతున్నారు. అనధికార లే అవుట్లు, ప్లాట్లు అధికంగా ఉన్న జిల్లాల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెండో స్థానంలో ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకు ఫీజుల రూపంలో ప్రజలు చెల్లించిన మొత్తాల్లో జిల్లా రూ.271 కోట్లతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది.
30 వరకు గడువు పొడిగింపు
ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ మున్సిపల్ శాఖ జీవో జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రాయితీ కూడా ఈ నెల చివరి వరకు వర్తిస్తుందని జీవోలో పేర్కొంది. ఈ నెల 1వ తేదీ నుంచే ఈ ఉత్వర్వులు వర్తిస్తాయని తెలిపింది. మార్చి 31న తొలిసారి గడువు ముగియగా.. అప్లికెంట్లు ఫీజు చెల్లించేందుకు ముందుకు రాకపోవడం, టెక్నికల్ సమస్యల వల్ల 25 శాతం రాయితీ ఇచ్చి ఏప్రిల్ 31 వరకు పెంచారు. అనంతరం మే 1 నుంచి 3 వరకు 3 రోజులు గడువు పెంచారు. తర్వాత మే చివరి వరకు పెంచగా, తాజాగా ఈ నెల 30 వరకు పెంచారు.
ఎల్ఆర్’ఎస్’.. రాయితీకి ‘నో’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES