చెక్డ్యామ్ల మీద
జిలెటిన్ స్టిక్స్ బాంబులు
ఇసుక కాంట్రాక్టర్ల
కోసం రైతులు బలి కావాలా?
సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదనీ, ‘పక్కా మాఫియా పాలన’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. నాడు అసెంబ్లీ ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేశారని తెలిపారు. నేడు ఇసుక మాఫియా కోసం ఏకంగా చెక్డ్యామ్ల మీద జెలటిన్ స్టిక్స్తో బాంబులు వేస్తున్నారని విమర్శించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ ‘ఇది మానవ నిర్మిత విధ్వంసం’అని మొత్తుకుంటున్నా ఈ ‘చిట్టి నాయుడి’ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని పేర్కొన్నారు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్ చేసి, జెలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారని వివరించారు. ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయనీ, రూ.కోట్ల ప్రజా ధనంతో కట్టిన చెక్డ్యామ్లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వమా లేక గ్యాంగ్స్టర్ల అడ్డానా?అని అడిగారు. భూగర్భ జలాలు పెరగాలని తాము చెక్ డ్యామ్లు కడితే వాటిని కూల్చివేసి రైతుల పొలాలను ఎడారిగా మారుస్తున్నారని తెలిపారు. ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం తెలంగాణ రైతాంగం బలి కావాలా? అని అడిగారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కూలిపోయాయంటూ కట్టుకథలు అల్లిన కాంగ్రెస్ మంత్రులకు రాజేంద్ర సింగ్ నివేదిక చెంపపెట్టు అని విమర్శించారు. దీనికి సమాధానమేంటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అభివృద్ధి చేయడం చేతకాదు కానీ, ఉన్న ఆస్తులను కూల్చడంలో వారు సిద్ధహస్తులని పేర్కొన్నారు. తెలంగాణ ఆస్తులపై బాంబులు వేస్తున్న మాఫియా వెనుక ఉన్న అసలు దొంగలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజేంద్ర సింగ్ డిమాండ్ చేసినట్టు పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందేననీ, లేదంటే ఈ బాంబుల సెగ సీఎం కుర్చీ దాకా రావడం ఖాయమని తెలిపారు.
ప్రజాపాలన కాదు మాఫియా పాలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



