Sunday, May 18, 2025
Homeరాష్ట్రీయంఎమ్మెల్యే 'మాగంటి'మధ్యంతర పిటీషన్‌ డిస్మిస్‌

ఎమ్మెల్యే ‘మాగంటి’మధ్యంతర పిటీషన్‌ డిస్మిస్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో పేర్కొన్న అభియోగాలకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు చెప్పింది. అందువల్ల ఆదిలోనే ఈ పిటీషన్‌ను కొట్టివేయలేమని పేర్కొంటూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఈవీఎంలో అవకతవకలు ఉన్నాయంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించారని తెలిపింది. వీటన్నింటినీ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. అజారుద్దీన్‌ పిటిషన్‌ లోపభూయిష్టంగా ఉందనీ, దాన్ని కొట్టివేయాలని కోరుతూ మాగంటి గోపీనాథ్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఎన్నికల పిటిషన్‌పై విచారణ ప్రక్రియను ఎదుర్కోవాల్సిందేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అజారుద్దీన్‌, ఓటరు వీ నవీన్‌యాదవ్‌ ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. దీనిపై మాగంటి గోపీనాథ్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను గత ఏడాది సెప్టెంబరు 18న హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఎమ్మెల్యే మాగంటి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ, సీపీసీలో నిబంధన 11 ప్రకారం తాజాగా విచారణ చేపట్టాలని మార్చి 19న ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ మాగంటి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై జస్టిస్‌ కె లక్ష్మణ్‌ మరోసారి విచారణ చేపట్టారు. అజారుద్దీన్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 26 ఈవీఎంల గురించి పూర్తి వివరాలు సమర్పించామన్నారు. మరో 30 పోలింగ్‌ బూత్‌ల్లోనూ అవకతకవలు చోటుచేసుకున్నాయనీ, వీవీప్యా డ్‌లకు, పోలింగ్‌ ఏజెంట్లకు సమర్పించిన లెక్కలకు పొంతన లేదన్నారు. ఈవీఎంలను మార్చడం, కంట్రోల్‌ యూనిట్‌ నెంబరు, బ్యాలెట్‌ యూనిట్‌ నెంబర్లకు పొంతన కుదరకపోవడం, వీవీ ప్యాడ్లకు ఏజెంట్లకు ఇచ్చిన వివరాలకు పొంతన లేకపోవడంపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని వాదించారు. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో కొత్తవి ఏర్పాటు చేశారనీ, ఆ సమయంలో ఏజెంట్ల సమ్మతి తీసుకోలేదన్నారు. మరో 4 బూత్‌ల్లో ఎలక్ట్రానిక్‌ యూనిట్లు లోపభూయిష్టంగా ఉన్నాయని తేలిందన్నారు. ఈ విషయంలో రిటర్నింగ్‌ అధికారి కౌంటింగ్‌ ప్రక్రియను నిలిపివేయకుండా కొనసాగించి నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు. కొన్నింటికి సీలు లేదని, మరికొన్నింటికి సీళ్లు మార్చినట్లు ఉన్నాయన్నారు. డిసెంబరు 3, జనవరి 2న రాతపూర్వక వినతి పత్రాలు సమర్పించినా రిటర్నింగ్‌ అధికారి పరిగణనలోకి తీసుకోలేదని తప్పు పట్టారు. ఓటరు నవీన్‌యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో వాస్తవాలను తొక్కిపెట్టారని పేర్కొన్నారు. అందువల్ల మాగంటి గోపీనాథ్‌ ఎన్నికను రద్దు చేయాలన్నారు .గతంలో డిగ్రీ అని పేర్కొన్న మాగంటి తరువాత ఇంటర్మీడియట్‌ అని పేర్కొన్నారని వివరించారు. పెండ్లి అయ్యి కుమారుడు ఉన్నారని, వారి ఆస్తుల వివరాలను వెల్లడించలేదన్నారు. వాదనల అనంతరం హైకోర్టు, ఎన్నికల పిటిషన్‌ను తిరస్కరించాలని మాగంటి ప్రస్తావించిన సుప్రీం కోర్టు తీర్పులు ఇక్కడ వర్తించవన్నారు. ఎన్నికల పిటిషన్‌పై విచారించడానికి పలు ఆధారాలను సమర్పించారని హైకోర్టు స్పష్టంచేసింది. సీపీసీలోని నిబంధన 11 ప్రకారం పరిశీలించినా ఎన్నికల పిటిషన్‌ను ఆదిలోనే తిరస్కరిం చబోమని చెప్తూ, మాగంటి దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -