నవతెలంగాణ-కమ్మర్ పల్లి!
సీజనల్ రాకుండా ఉండేందుకు ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు.వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ సందర్శించి పరిశీలించారు.
కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సిబ్బంది గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి కుండిలను, పూల కుండీలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పనికి రాని టైర్లు, బకిట్లలో, త్రాగిన కొబ్బరి బొండాలలో నీళ్లు నిల్వ ఉంచకూడదన్నారు. ఖాళీ చేసి పనికి రాని వస్తువులను పడేయలని, వాడకుండా ఉన్న కూలర్లలో ఉన్న నీళ్లను తీసివేసి శుభ్రంగా చేసుకోవాలన్నారు.
రోజుల తరబడి నిల్వ ఉన్న నీటిలో లార్వా, దోమలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని చేస్తాయని తెలిపారు. ఇంట్లోని చెత్తను వీధిలో, మురికి కాలువలలో పాడేయకుండా ఇంటిలోనే తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా గ్రామ పంచాయతీ ద్వారా అందించిన చెత్తబుట్టలో నిల్వ ఉంచుకొని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులోనే వేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగా జమున, ఏఎన్ఎం కృష్ణవేణి, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.