ప్రస్తుతం వాటాదారులతో సంప్రదింపులు
న్యూఢిల్లీ : వికలాంగుల కోసం కొత్త ముసాయిదాతో రవాణా వ్యవస్థలలో భారీ మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బస్సులు, మెట్రో రైళ్లలో తప్పనిసరి వీల్చైర్ స్థలం, స్టేషన్లలో స్టెప్-ఫ్రీ టాయిలెట్లు, లెవల్ బోర్డింగ్ ర్యాంప్లు, వాయు, రైలు, రోడ్డు రవాణా నెట్వర్క్లలో శిక్షణ పొందిన సిబ్బంది వంటివి రవాణా వ్యవస్థలలో వికలాంగులకు (పీడబ్ల్యూడీలు) మరింత అందుబాటులోకి తీసుకురావటానికి కొత్త డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్లో భారీ మార్పులు ప్రతిపాదించారు. ఈ మేరకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ విభాగం.. వాటాదారులు, సాధారణ ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలను కోరింది. ‘రవాణా యాక్సెసిబిలిటీ ఫ్రేమ్వర్క్’ ముసాయిదాను స్ట్రాటజిక్ యాక్సెసిబిలిటీ సెల్-రైట్స్ ఆఫ్ రైడర్ (ఎస్ఏసీ-ఆర్ఆర్) తయారు చేసింది. వికలాంగుల చట్టం, 2016, సంబంధిత నియమాలకు అనుగుణంగా అవరోధ రహిత వాతావరణాన్ని బలోపేతం చేయటానికి, నియమాలను గుర్తించటానికి ఈ ముసాయిదా ప్రమాణాలను తయారు చేసినట్టు సంబంధిత విభాగం తెలిపింది. ఈ ముసాయిదా ప్రకారం.. కేంద్ర పథకాల కింద కొనుగోలు చేసిన అన్ని కొత్త బస్సుల్లో లో-ఫ్లోర్ ఎంట్రీ, ర్యాంప్లు, సేఫ్టీ బెల్టులు, వీల్ చైర్ ప్రాంతాలుండాలి. పీఎం ఈబస్ సెవా, టైప్-3 ఇంటర్సిటీ బస్సులు వంటి ప్రస్తుత సర్వీసులను కూడా పరీక్షించిన లిఫ్ట్లు లేదా బ్రిడ్జి ర్యాంప్లతో తిరిగి అమర్చనున్నారు. ప్రతి బస్సులో కనీసం నాలుగు ప్రాధాన్యతా సీట్లు సీట్ బెల్టుతో తప్పనిసరి. సుదూర రైళ్లలో వీల్చైర్తో కూడిన కనీసం ఒక కోచ్, గ్రాబ్ బార్లతో కూడిన టైప్-ఎ టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలని ముసాయిదా పేర్కొన్నది. విమానాశ్రయాలలో పార్కింగ్ నుంచి చెక్-ఇన్ వరకు స్టెప్-ఫ్రీ యాక్సెస్, రోల్అవుట్ ర్యాంప్లతో ఏరోబ్రిడ్జిలు, విమానాలలో వీల్చైర్-ఫ్రెండ్లీ సీటింగ్, ఐసెల్ కుర్చీల లభ్యతను ముసాయిదా ప్రతిపాదించింది.
యాప్లు, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లను అందుబాటులో ఉంచాలని వివరించింది. డిజెబులిటీ యాక్సెస్కు సంబంధించిన ఫిర్యాదు డేటాను సంబంధిత పోర్టల్లో ప్రచురించాలి. ఈ ముసాయిదాలో కాలపరిమితి గల బడ్జెట్, ఇతర నిబంధనలు ఉన్నాయి. ఈ మార్గదర్శకాలపై సంప్రదింపుల అనంతరం తుది వెర్షన్ వెలువడే అవకాశమున్నదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్తో వికలాంగుల రవాణా వ్యవస్థలలో భారీ మార్పులు
- Advertisement -
- Advertisement -