రైతులను బతిమాలిన ఏఈవోలు
సీఎం కార్యక్రమం కోసం ఏఈవోలకు టార్గెట్లు
ప్రతీ ఆర్వీకి 200 మంది రైతులను తరలించాలని ఆదేశాలు
నవతెలంగాణ – మల్హర్ రావు : రైతు వేదికల్లో ముఖ్యమంత్రితో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమాల్లో ఏఈవో (అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్)లు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కార్యక్రమానికి రైతు వేదిక (ఆర్వీ)ల వద్దకు రైతులను తరలించాలని జిల్లా వ్యవసాయాధికారులు టార్గెట్లు విధించడంతో ఇబ్బందులు మొదలవుతున్నాయి.ప్రతీ ఆర్వీలో కనీసం 200 మందికి తగ్గకుండా రైతులను తరలించాలని ఆదేశాల్లో స్పష్టం చేయడంతో ఏఈవోలు తరలించడానికి తలమునకలవుతున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమాలకు వచ్చేం దుకు మెజారిటీ రైతులు సుముఖంగా ఉండడం లేదు.ప్రస్తుతం చాలా చోట్ల వ్యవసాయ పనులు మొదలవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీఎంతో జరిగే ముఖాముఖిలో తప్పకుండా రైతుభరోసా లబ్దిదారులతో సీఎం మాట్లాడారు. ఈ నేప థ్యంలో మండల వ్యాప్తంగా 9,653 వేల మంది రైతులున్నారు.ఇందులో ఏఈవోలు 200 మంది రైతులకు ఫోన్లు చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా బతిమాలిన కేవలం 60 మంది మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తోంది.మొన్నామధ్య రైతుభరోసా ప్రారంభం సందర్భంగా కూడా రైతులతో ముఖ్యమంత్రితో ఇలాంటి కార్యక్రమాన్నే నిర్వహించారు. అప్పుడు ప్రతీ ఏఈవోలకు నిర్వహణ ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లిస్తామని చెప్పారు. దీంతో ఆ కార్యక్రమంలో హాజరైన ప్రతీ రైతుకు టీ, స్నాక్స్ ఏఈవోలే అందించారు.ఇందుకోసం వారే చేతి నుంచి డబ్బులు పెట్టుకున్నారు. ఆ డబ్బులు ఎపుడు వస్తాయా? అని ఎదురుచూస్తుంటే.. తీరా మరోసారి అలాంటి కార్యక్రమమే నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. చేసేది లేక మళ్లీ రైతులకు ఫోన్లు చేస్తూ.. చేతి చమురు వదిలించేం దుకు సిద్ధమైయ్యారు.
రైతు వేదికల్లో ఇబ్బందులివీ!
మండలంలో తాడిచర్ల, రుద్రారం,కొయ్యుర్,పెద్దతూండ్లలో రైతు వేడికలున్నాయి.ఇందులో ఎక్కడ తాగునీరు సదుపాయం లేదు.కుర్చీలు వేసే సిబ్బంది లేరు.టీ, స్నాక్స్ ఇచ్చే దిక్కు లేదు.మరుగుదొడ్లు శుభ్రం చేసే వారు లేరు.వేదికకు కనీసం ఊడ్చే సిబ్బంది లేరు.టెక్నికల్ ఎక్విప్మెంట్ కు డబ్బులు రావు.నిర్వహణకు సిబ్బంది లేరు.
ఏఈవోలపై పనిభారం..
మండలంలో ఏఈఓ లు నలుగురు ఉన్నారు. వాస్తవానికి ప్రతీ రైతు వేదికలో ఒకే ఒక ఏఈవో ఉంటారు. రైతులకు సంబంధించిన ప్రతీ విషయం వీరే చేసుకోవాలి.పంటలకు సంబంధించి ఎప్పటికపుడు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం. సాగులో సమస్యలు తలెత్తితే పరిష్కరించడం. పీఎం కిసాన్ యోజనకు సం బంధించి కేవైసీ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, రైతు విశిష్ట సంఖ్య నమోదు చేయడం, పంటల నమోదు చేయడం, రైతుబంధు, రైతు బీమా నమోదు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మట్టి నమూనాల సేకరణ తదితర పనులు ఉంటాయి. ఇవి కాకుండా రైతు వేదిక నిర్వహణ బాధ్యతలు కూడా చూసుకుంటారు.
వీరు తప్ప మరే ఇతర సిబ్బంది లేకపోవడంతో వీరే ఉదయం వచ్చి రైతు వేదికను ఊడ్చుకోవాలి, కార్యక్రమాలు జరిగినపుడు కుర్చీలు వేయడం, వారికి టీ స్నాక్స్.. కూడా వీరే అందించాల్సి వస్తోంది. అధికారిక కార్యక్రమాలు జరిగినప్పుడు వచ్చిన వారంతా మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు.తరువాత డబ్బులు ఇచ్చి వాటిని శుభ్రం చేయించుకోవాల్సివస్తోంది. మొత్తానికి ఏఈవోలు నిర్వహించే ప్రతీ అధికారిక కార్య క్రమం ఇంట్లో చేసే శుభకార్యంలా ప్రతీది దగ్గ రుండి చూసుకోవాల్సిన స్థితి.