Saturday, May 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఘనంగా ఏర్పాట్లు చేయండి

ఘనంగా ఏర్పాట్లు చేయండి

- Advertisement -

– అంతటా మిస్‌వరల్డ్‌ సందడి ఉండాలి : అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలకు ఎలాంటి లోటు రాకుండా ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అందాల పోటీల ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పర్యాటక శాఖ, పోలీసు, ఇతర విభాగాలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. మిస్‌వరల్డ్‌ పోటీల ఏర్పాట్ల వివరాలను అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఎయిర్‌పోర్టులు, అతిథులు బస చేసే హౌటళ్లతోపాటు పోటీలు జరిగే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారనీ, వారందరికీ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆతిథ్యమివ్వాలని అన్నారు. పోటీదారులతో పాటు దేశ విదేశాల నుంచి ఈవెంట్‌ కవరేజీకి దాదాపు మూడు వేల మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని గుర్తు చేశారు. పర్యాటక శాఖతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని చార్మినార్‌, లాడ్‌ బజార్‌, తెలంగాణ తల్లి, సెక్రెటేరియట్‌తో పాటు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను మిస్‌వరల్డ్‌ పోటీదారులు సందర్శించనున్న నేపథ్యంలో, అవసరమైన రవాణా వసతులు కల్పించాలన్నారు. అతిథులు సందర్శించే ప్రాంతాల్లో అనుకోని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా వాటిని అధిగమించే ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆదేశించారు. మహిళా సాధికారతను చాటిచెప్పేలా రాష్ట్రంలో ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ల సందర్శనతో పాటు, ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ సెమీఫైనల్స్‌ను తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈవెంట్‌ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు, విద్యుత్‌ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణ సూచనలకనుగుణంగా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలనీ, ఈదురు గాలులు, వర్షాలు వచ్చినా గ్రేటర్‌ పరిధిలో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీతో పాటు హైడ్రా విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ప్రభుత్వం తరఫున మిస్‌ వరల్డ్‌ 2025 ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్పేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బా పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఒకరోజు మిస్‌వరల్డ్‌ పోటీలు చూపించే ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వేడుకలు జరిగే రోజుల్లో హైదరాబాద్‌ అంతటా మిస్‌ వరల్డ్‌ సందడి కనిపించేలా తోరణాలు, లైటింగ్‌, హౌర్డింగ్‌లతో పాటు సిటీలోని ముఖ్యమైన జంక్షన్లు, చారిత్రక ప్రదేశాలను అందంగా అలంకరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, డీజీపీ జితేందర్‌, సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు, ఏడీజీపీ స్టీఫెన్‌ రవీంద్రతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -