నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఈ నెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కూకుట్ల చొక్కాకుమారి పిలుపునిచ్చారు.
మంగళవారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశానికి వెళ్లి కార్మికులతో కలిసి ధర్నా జయప్రదం కోరుతూ కరపత్రము ఆవిష్కరించి, మాట్లాడారు. గత జనవరి నుండి నూతన జాబు కార్డులు ఇవ్వకపోవడంతో అనేకమంది వ్యవసాయ కూలీలు, పేదలు ఉపాధి హామీ పథకంలో పనిచేసే పరిస్థితి లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న ప్రతి వారికి నూతన జాబు కార్డ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్టంలో వారం వారం డబ్బులు చెల్లించాలని ఉన్న నెల రోజులకు ఒక్క సారి డబ్బులు ఇస్తే, కూలీల కుటుంబాలు ఏమి తిని బతకాలని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా వారం వారం డబ్బులు చెల్లించాలని, 200 రోజుల పని దినాలు కల్పించాలని, రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, పని ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించాలని, గ్రామపంచాయతీ ద్వారా ఉపాధి కార్మికులకు తాగడానికి నీళ్లు అందించాలని కోరారు. ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించి పెండింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ఈ నెల 30న నిర్వహిస్తున్న ధర్నాలలో ఉపాధి హామీ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి హామీ కార్మికులు పుల్లెల శ్రీలత, మెరుగు లక్ష్మమ్మ, గజ్జి కవిత, దేశెట్టి పద్మ, మెరుగు స్వాతి, కొండమడుగు మడుగు పద్మ, కొండమడుగు కావ్య , పుల్లెల సంతోష, గజ్జి పద్మ, పల్లెర్ల ప్రమీల, అందె మనమ్మ, కొండ భాలమని, బొడ్డు ధనలక్ష్మి, దొమ్మాటి శంకరమ్మ, గడ్డం అంజమ్మ లు పాల్గొన్నారు.