Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతప్పుడు పత్రాలతోఎయిర్‌పోర్టుకు వచ్చిన వ్యక్తి అరెస్టు

తప్పుడు పత్రాలతోఎయిర్‌పోర్టుకు వచ్చిన వ్యక్తి అరెస్టు

- Advertisement -

– ఆగ్రా నుంచి శంషాబాద్‌ మీదుగా బెంగళూరు వెళ్లేందుకు యత్నం
– ప్రభుత్వ ఎంట్రెన్స్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ కుట్ర
– నిందితుడికి 14 రోజుల రిమాండ్‌
నవతెలంగాణ-శంషాబాద్‌

తప్పుడు ధ్రువపత్రాలతో ఆగ్రా నుంచి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మీదుగా బెంగళూరు వెళ్లడానికి వచ్చిన వ్యక్తిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం జరిగింది. ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ అవుట్‌ పోస్ట్‌ స్టేషన్‌ హౌస్‌ అధికారి జె. బాలరాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన అమిత్‌కుమార్‌ ‘అవకాశ్‌’ అనే నకిలీ పేరుతో టికెట్లు బుక్‌ చేసుకుని ఆగ్రా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బెంగళూరు విమానానికి వెళ్తున్నాడు. గేట్‌ ఏటీఆర్‌ఎస్‌-16 వద్ద భద్రతా సిబ్బంది అతన్ని తనిఖీ చేశారు. తనిఖీల్లో అతని వద్ద తప్పుడు పత్రాలను గుర్తించారు. దాంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ప్రభుత్వం నియామక పరీక్షల్లో మోసం చేయడానికి ఉపయోగించే బ్లూ టూత్‌ పరికరాలు, అనేక కాపీ అయిన ఆధార్‌ కార్డులు, పాఠశాల సర్టిఫికెట్లు, జింద్‌ కాలేజ్‌ రబ్బరు ముద్ర వంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. మోసపూరిత పత్రాలతో బెంగళూరులో జరగనున్న నియామక పరీక్షల్లో కాపీకి సాయపడేందుకు ప్రయాణిస్తున్నట్టు విచారణలో తేలింది. వెంటనే అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితునికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. రిమాండ్‌ ముగిసిన తర్వాత నిందితుడిని పోలీస్‌ కస్టడీకి తీసుకొని.. ఇందులో ఇంకా ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేపడతామని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -