నవతెలంగాణ-హైదరాబాద్ : నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ కలహాలు అందరికీ తెలిసిన విషయమే. అన్నదమ్ములైన మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య సఖ్యత లేదని, విభేదాలున్నాయనే విషయం తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులకు, సాధారణ ప్రజానీకానికి అవగతమే. తాజాగా మంచు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో తమ కుటుంబంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తొమ్మిదేళ్లుగా కుటుంబానికి దూరంగా తమ జీవితాన్ని తాము గడుపుతున్నామని ఆయన అన్నారు. తన అర్ధాంగి బొమ్మల కంపెనీ ప్రారంభించిందని, దానికి తాను ఆర్ట్స్ వర్క్ చేయడంతో పాటు కథలు రాశానని, ఆత్మగౌరవంతో జీవిస్తున్నామని చెప్పారు. తాను ఎలాంటి వ్యక్తినో చాలా మందికి తెలుసునన్నారు. అయితే ఊహించని విధంగా కష్టాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్నందువల్లే తాను మీడియా ముందుకు వచ్చినట్లు వివరించారు.
తన అర్ధాంగి గర్భవతిగా ఉన్న సమయంలో తామంతా మళ్లీ కలిశామని, అయితే అది తమ కుటుంబంలోని ఒకరికి నచ్చలేదని అన్నారు. మరోవైపు కళాశాలలోని కొన్ని సమస్యల గురించి పెద్దల వరకు వెళ్లడం లేదని విద్యార్థులు లేఖలు రాసి తనకు ఇచ్చారని, దీనిపై మాట్లాడితే నీకేం సంబంధం అనే మాట వచ్చిందని అన్నారు. విద్యాసంస్థలో పనిచేసే వారందరితో తనపైనా, తన అర్ధాంగిపైనా కేసులు పెట్టించారని ఆరోపించారు.
సంబంధం లేని విషయాల్లో తన అర్ధాంగిని లాగారని, అప్పుడు తన హృదయం ముక్కలైందన్నారు. ఆమెకు అన్నీ తానేనని పేర్కొన్నారు. ఒక్క కేసు కూడా తాను వారిపై పెట్టలేదన్నారు. తనకు ఆవేశం ఉందని, అయితే అది బాధతో వచ్చిన కోపమని అన్నారు. తన తండ్రి మోహన్ బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని, తన కుమార్తెను ఆయన ఒడిలో పెట్టాలని ఉందని అన్నారు.
కానీ చేయని తప్పును అంగీకరిస్తే, తన పిల్లలకు తానేమి నేర్పించినట్లు అవుతుందన్నారు. తన తండ్రి మోహన్ బాబు నేర్పించిన నీతి ఇదేనని, అందుకే తాము ముందుకు వెళ్లలేకపోతున్నామని అన్నారు. తామంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నానని మనోజ్ తెలిపారు. సమస్యలు సృష్టించిన వారు వారి తప్పును తెలుసుకుంటారని మనోజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.