– మాంజా తగిలి ఏఎస్ఐ మెడకు తీవ్ర గాయం
– మరో ఘటనలో గాయపడిన వృద్ధురాలు
– రైతు మెడకు గాయం
నవతెలంగాణ-ఉప్పల్/ నవీపేట్
సంక్రాంతి నేపథ్యంలో ఎగురుతున్న గాలిపటాల మాంజా ప్రమాదకారిగా మారింది. తాజాగా మెడకు మాంజా తగిలి ఏఎస్ఐకు తీవ్ర గాయాలైన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలాగే, మీర్పేట్ పరిధిలో ఓ వృద్ధురాలి కాలికి, నిజామాబాద్ జిల్లా నవీపేట్లో రైతు మెడకు మాంజా తగిలి తీవ్ర గాయమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ ఉప్పల్ స్వరూప్ నగర్లో నివాసముంటున్న నాగరాజు నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆయన ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం బైక్పై వెళ్తుండగా, సౌత్ స్వరూప్నగర్లో అకస్మాత్తుగా మెడకు మాంజా తగిలి తీవ్రంగా కోసుకుపోయింది. ఆయనను చికిత్స కోసం ఎల్బీనగర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిసింది.
వృద్ధురాలి కాలికి గాయాలు
మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాంజా తాకి వృద్ధురాలి కాలికి గాయమైంది. సోమవారం అల్మాస్గూడ ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు యాదమ్మకు చైనా మాంజా కాలికి చుట్టుకుంది. దాంతో ఆమె కాలుకు తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
రైతు మెడకు గాయాలు
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో మంగళవారం రైతు మెడకు మాంజా తగిలి గాయమైంది. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రైతు ఆర్మూర్ మణికాంత్ మోటార్ బైక్పై పొలం నుంచి గడ్డిమోపు తీసుకుని వస్తుండగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద గాలిపటంతో తెగిపడిన మాంజా మెడకు చుట్టుకొని గాయాలయ్యాయి. మేడకు రక్తస్రావం కావడంతో నందిపేట్ మండల కేంద్రంలోని ప్రయివేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఎస్ఐ శ్రీకాంత్ రైతును పరామర్శించి మాంజాను పరిశీలించగా.. చైనా మాంజా కాదని, మామూలు మాంజాకే కలర్ కోటింగ్ ఇవ్వడంతో గాయాలైనట్టు తెలిపారు.



