పెరిగిన వరద ఉధృతి
తెరుచుకోని 2, 7, 8 నంబర్ల గేట్లు
పరిశీలిస్తున్న ఇంజినీర్లు
రిపేర్లు చేసి నీటిని విడుదల చేశాం : సంగారెడ్డి తహసీల్దార్ బలరాం
నవతెలంగాణ-సంగారెడ్డి
భారీ వర్షాలకు సంగారెడ్డి మండలం కలబ్గుర్ గ్రామంలోని మంజీర బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది. దీనితో నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నించగా 2,7,8 బ్యారేజీ గేట్లు తెరుచుకోలేదు. దీనితో మంజీరా బ్యారేజ్ గేట్లపై నుంచి వరద నీరు ఎగిసిపడుతున్నది. గేట్లు తెరుచుకోని సమాచారాన్ని బ్యారేజీ సిబ్బంది హైదరాబాద్లోని హెచ్ఎండీఏ ఇంజనీర్లకు అందించారు. అక్కడకు వచ్చిన ఇంజనీర్లు గేట్లను పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా 2025 మార్చి 22న మంజీర బ్యారేజీని జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం-2021 ప్రకారం ఏర్పాటైన ఎస్డీఎస్ఓ ఆధ్వర్యంలో నిపుణుల బృందం పరిశీలించింది. బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లర్లకు (పియర్ల) పగుళ్లు వచ్చాయని గుర్తించింది. వాటికి రిపేర్లు చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఆచరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో భారీ వర్షాల వల్ల వరదలు పెరగడంతో నీటి ప్రవాహానికి గేట్లు తెరుచుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. గతేడాది గేట్లు ఓపెన్ చేసే సమయంలో కూడా గేట్లు మొరాయించాయి. తెరిచిన గేట్లను మూసేటప్పుడు కూడా ఇబ్బందులు తప్పవని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీకి హైదరాబాద్ నుంచి ఇంజనీర్లను రప్పించగా వారు బ్యారేజ్ గేట్లను పరిశీలిస్తున్నారు. మంజీర బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు తేరుకుని బ్యారేజీకి రిపేర్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
గేట్లను ఓపెన్ చేశాం : బలరాం, సంగారెడ్డి తహసీల్దార్
మంజీర బ్యారేజీ గేట్లు తెరుచుకోకపోవడంతో హైదరాబాద్ నుంచి ఇంజనీర్లను రప్పించాం. వారి సహకారంతో గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నాం. ముఖ్యంగా 2, 7, 8 గేట్లు మొరాయించాయి. వాటికి రిపేర్ చేసి 1.5 మీటర్ల ఎత్తుకు గేట్లను లేపి 13,333 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నాం. ప్రస్తుతానికి ఎలాంటి అంతరాయం లేదు.
ప్రమాదంలో మంజీర బ్యారేజీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES