Saturday, June 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుడేంజర్‌ జోన్‌లో మంజీరా బ్యారేజీ

డేంజర్‌ జోన్‌లో మంజీరా బ్యారేజీ

- Advertisement -

– మరమ్మతుల్లేక తుప్పుపట్టిన గేట్లు
– 15 కి.మీ పొడవున దట్టమైన చెట్లు.. బలహీన పడిన కట్టలు
– దెబ్బతిన్న స్పిల్‌వేలోని కొంత భాగం
– మేడిగడ్డ తరహాలో కొట్టుకుపోయిన బరాజ్‌
– ఐదు జిల్లాలకు తాగునీరు.. లక్షల ఎకరాలకు సాగునీరు
– డ్యామ్‌ భద్రతను గాలికొదిలేసిన ఇరిగేషన్‌ అధికారులు
– డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందన్న ఎస్‌డీఎస్‌ఓ నివేదిక
– సీడబ్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనానికి సిఫారసు
– డ్యామ్‌ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ- మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

ఎంతో చరిత్ర కలిగిన మంజీరా బ్యారేజీ డేంజర్‌ జోన్‌లో పడింది. డ్యాం భద్రత, పరిరక్షణ బాధ్యతను ఇరిగేషన్‌ శాఖ విస్మరించింది. ప్రభుత్వాలు సైతం కొత్త ప్రాజెక్టులతో పాత ప్రాజెక్టుల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యం ఖరీదుగా మంజీరా డ్యాం కూడా మేడిగడ్డ తరహాలోనే బరాజ్‌ అప్రాన్‌ కొట్టుకుపోయి దిగువ భాగంలో గుంతలు పడ్డాయి. క్రస్ట్‌ గేట్లకు మరమ్మతుల్లేని ఫలితంగా అవన్నీ తుప్పు పట్టిపోయాయి. గత సీజన్‌ వరదల్లో 8వ గేట్‌ మొరాయించింది. సుమారు 15 కిలోమీటర్ల మేర చెట్లు పెరగడం వల్ల కట్టలు బలహీన పడ్డాయి. ఫలితంగా స్పిల్‌వే కొంత మేర దెబ్బతిన్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల నిర్వహణపై నివేదిక ఇవ్వాలని కోరడంతో స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ బృందం అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. అయినా ఇంత వరకు ఇరిగేషన్‌ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశముందని నిపుణులు హెచ్చ రిస్తు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని డ్యాం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.
హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌ ఇతర ప్రాంతాల్లో తాగునీరు వనరుగా మంజీరా ప్రాజెక్టు ఉంది. హైదరాబాద్‌ నగర ప్రాంత ప్రజ లకు నిత్యం 100 మిలియన్‌ గ్యాలన్ల రక్షిత మంచి నీటిని అందిస్తుంది. 300 రకాల పక్షులు, 700 ముగ్గర్‌ మొసళ్లకు నిలయంగా ఉంది. వన్యప్రా ణుల అభయారణ్యంగా తెలంగాణలో మొట్టమొ దటి రామ్‌సర్‌ చిత్తడి నేలగా గుర్తింపు పొందేంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు నిర్వహణ పట్ల ఇరిగేషన్‌ అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి.
కొట్టుకుపోయిన మంజీరా డ్యాం అప్రాన్‌
మంజీరా బరాజ్‌ నుంచి విడుదలైన వరద ఉధృతికి డ్యామ్‌ దిగువన రక్షణగా ఏర్పాటు చేసిన అప్రాన్‌ కొట్టుకుపోయింది. అప్రాన్‌కు సంబంధిం చిన కాంక్రీట్‌ కొట్టుకుపోవడంతో బరాజ్‌ దిగువన భారీ స్థాయిలో గుంతలు ఏర్పడ్డాయి. మిగిలి ఉన్న అప్రాన్‌ భాగం కూడా ఎప్పుడైనా కొట్టుకుపోయే ప్రమాదముంది. బరాజ్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే భవిష్యత్‌లో తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు దిగువన ఉన్న అప్రాన్‌ వరద ధాటికి కొట్టుకుపోయింది. ఆ తర్వాత కాలంలో మేడిగడ్డ బరాజ్‌ కుంగిపోయింది. మిగిలిన రెండు బరాజ్‌లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే తరహాలో మంజీర బరాజ్‌ నుంచి విడుదలయ్యే వరద ఉధృతికి దిగువభాగంలో నిరంతరం బరాజ్‌కు నష్టం కలిగించే ప్రమాదముంది. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోతే ముప్పు తప్పదని, కోత క్రమంగా పెరిగి డ్యామ్‌ వరకు విస్తరించడం ద్వారా డ్యామ్‌ భద్రతకే ముప్పు వాటిల్లే అవకాశముందని నిపుణులు సూచించారు. బరాజ్‌ మట్టి కట్టలపై పెద్ద ఎత్తున 1.5 కిలో మీటర్ల మేర దట్టమైన తుమ్మ చెట్లు పెరిగాయి. చెట్ల వేర్లు చొచ్చుకుపోయి బరాజ్‌ మట్టి కట్టలు బలహీన పడ్డాయి. అదే విధంగా ఏండ్ల తరబడి ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో గేట్లు తుప్పు పట్టాయి. గతంలో వరదల సమయంలో 8వ గేటు మొరాయించింది. స్పిల్‌వేలోని కొంత భాగం కూడా దెబ్బతినదంతో అది మరింత పాడయ్యే అవకాశముంది.
సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనానికి సిఫారసు
మంజీరా డ్యామ్‌కు సంబంధించి బరాజ్‌ దెబ్బతినడంతో నేషనల్‌ డ్యామ్‌ సేప్టీ యాక్ట్‌-2021 ప్రకారం ఎస్‌డీఎస్‌ఓ నిపుణుల బృందం ఇటీవల మార్చి 22న పరిశీలించింది. డ్యామ్‌కు సంబంధించిన సమగ్రమైన పరిశీలన చేసిన బృందం పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. బరాజ్‌ మట్టి కట్టలపై చెట్లున్నాయని, అందువల్ల తాము కొంత పరిశీలించ లేకపోయామని కమిటీ తన నివేదికలో పేర్కొంది. మంజీర బరాజ్‌ పియర్లు దూరం నుంచి ధృఢంగానే కనిపిస్తున్నా సూక్ష్మంగా పరిశీలిస్తే మాత్రం వాటికి పగుళ్లువచ్చినట్టు గుర్తించింది.
తట్టుకోలేని వరద ఉధృతితోనే ఇలా జరిగిందని నిపుణుల బృందం అధికారులు తెలిపారు. రాతి ఆనకట్ట కావడంతో స్టీల్‌, కాంక్రీట్‌తో నిర్మించిన ఆనకట్టలకు ఉండే ధృఢత్వం ఉండదని అభిప్రాయపడ్డారు. సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనం చేయాలని సిఫారసు చేశారు.

మంజీరా బ్యారేజీ రిపేర్లు చేయిస్తాం : రాహుల్‌ బొజ్జ
మంజీరా బ్యారేజీకి పగుళ్లు లేవని ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రాహుల్‌ బొజ్జ అన్నారు. మంజీరా ప్రాజెక్టును, ప్రాజెక్టు కింద ఉన్న అప్రాన్‌, కట్టను ఆయన శుక్రవారం ఇరిగేషన్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాహుల్‌బొజ్జా మాట్లాడుతూ.. బ్యారేజీ హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్స్క్‌ ఆధీనంలో ఉందనీ, ఈ ప్రాజెక్టును హైదరాబాద్‌ తాగునీటికి మాత్రమే ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. డ్యామ్‌ సేప్టీ అధికారులు బ్యారేజీలో పగుళ్లు ఉన్నాయని ఎక్కడా చెప్పలేదన్నారు. అప్రాన్‌ నిర్మాణానికి, చిన్న చిన్న మరమ్మతుల కోసం రూ.3 కోట్లతో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ వాళ్లు అంచనా వేశారన్నారు. ప్రతి ఏటా రిపేర్ల కోసం నిధులిస్తున్నామని తెలిపారు.
నిర్వహణా లోపాలపై విచారణ జరపాలి
మంజీర బ్యారేజీ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్లే డ్యామ్‌కు పగుళ్లు వచ్చాయి. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవడంతో పాటు తక్షణమే శాశ్వత మరమ్మతులు చేయాలి. బ్యారేజీ నిర్వహణను ఇరిగేషన్‌ అధికారులు గాలికి వదిలేశారు. డ్యామ్‌కు తీవ్ర నష్టం వాటిల్లిన తర్వాత ఏమీ చేయలేమని చేతులెత్తేయడం తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రాజెక్టుల నిర్వహణకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడం, నిరంతర పర్యవేక్షణ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి నష్టాలే ఏర్పడతాయి.

– గొల్లపల్లి జయరాజు, సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -