– 13.3 కేజీలు స్వాధీనం
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 13.3 కేజీల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎయిర్పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేయగా.. మంగళవారం ఓ మహిళ వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆర్జీఐఏ అవుట్ పోస్ట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బ్యాంకాక్ నుంచి వచ్చిన భారతీయ ప్రయాణికురాలిని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), హైదరాబాద్ జోన్ యూనిట్ అధికారులు అడ్డుకున్నారు. చెక్ ఇన్ బ్యాగేజీలో భాగంగా ప్రయాణికురాలి బ్యాగ్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అందులో ఆకుపచ్చ ముద్ద పదార్థాన్ని కలిగి ఉన్న 20 ప్యాకెట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని క్షేత్ర పరీక్ష చేయగా.. అది గంజాయి అని తేలింది. దాదాపు 13.3 కిలోలు ఉన్న ఆ పదార్థం మార్కెట్లో సుమారు రూ.13.3 కోట్ల విలువ ఉంటుందని అధికారుల అంచనా. మహిళ వెంట తీసుకువచ్చిన ప్యాకేజింగ్ మెటీరియల్తో పాటు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం 1985 నిబంధన కింద అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో గంజాయి పట్టివేత
- Advertisement -
- Advertisement -