నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాలతో ముగిశాయి. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైనప్పటికీ, ఆ జోరును నిలబెట్టుకోలేకపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టపోయి 81,773.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 25,046.15 వద్ద ముగిసింది.
ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ సానుకూలంగా మొదలైనప్పటికీ 25,200 స్థాయి వద్ద తీవ్ర నిరోధం ఎదురైందని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఆ తర్వాత బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్టీ వంటి కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగిందని వారు వివరించారు. ఒక దశలో నిఫ్టీ వారపు కనిష్ఠ స్థాయి 25,008కి పడిపోయింది. అయితే, 25,000 అనే కీలకమైన మానసిక మద్దతు స్థాయి వద్ద కొనుగోళ్లు జరగడంతో కొంత కోలుకుంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 0.73 శాతం వరకు నష్టపోయాయి.
రంగాల వారీగా చూస్తే ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగతా సూచీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో నిఫ్టీ ఐటీ సూచీ 1.51 శాతం లాభపడింది. మరోవైపు రియల్టీ, మీడియా, ఆటో, ఎనర్జీ రంగాలు ఒక శాతానికి పైగా పతనాన్ని చవిచూశాయి. ఇటీవలి ర్యాలీ తర్వాత మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారని విశ్లేషకులు పేర్కొన్నారు.