– హాజరైన పీఎం మోడీ
న్యూఢిల్లీ : గుజరాత్లోని హన్సల్పుర్లోని మారుతీ సుజుకీ మోటార్ ప్లాంట్లో రెండు కీలక ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ లాంచనంగా ప్రారంభించారు. మారుతీ సుజుకీ తొలి గ్లోబల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) అయిన ఈ-విటారాను ఆయన జెండా ఊపి ఆవిష్కరించారు. అదే విధంగా హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచీ ఒనో, సుజుకీ మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకీలు పాల్గొన్నారు. మేడ్-ఇన్-ఇండియా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం ఇ-విటారా 100కి పైగా దేశాలకు ఎగుమతి కానుందని మోడీ తెలిపారు. యూరప్, జపాన్ వంటి అధునాతన మార్కెట్లకు కూడా వెళ్తుందని తెలిపారు. భారత్లో తదుపరి 5-6 సంవత్సరాల్లో రూ.70,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకీ ప్రకటించారు. ఈ పెట్టుబడి ఉత్పత్తి సామర్థ్యం పెంచడం, కొత్త మోడళ్ల పరిచయం, గ్రీన్ మొబిలిటీ, బ్యాటరీ తయారీ వంటి రంగాల్లో ఉపయోగపడుతుందన్నారు.. సుజుకీ గ్రూప్ ఇప్పటికే భారత్లో రూ.1 లక్ష కోట్ల పైగా పెట్టుబడి పెట్టి, 11 లక్షల ఉద్యోగాలు సృష్టించిందన్నారు.