లండన్ : వలస వ్యతిరేక ప్రదర్శనతో బ్రిటన్ రాజధాని లండన్ నగరం హోరెత్తింది. వలసవాదులకు వ్యతిరేకంగా లక్ష మందికి పైగా ప్రజలు శనివారం నగర వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలో జరిగిన అతి పెద్ద మితవాదులు ప్రదర్శనల్లో ఇది కూడా ఒకటని పరిశీలకులు చెబుతున్నారు. కొందరు ప్రదర్శకులు పోలీసులతో ఘర్షణకు దిగడంతో 26 మంది అధికారులు గాయపడ్డారు. ‘యునైట్ ది కింగ్డమ్’ పేరిట జరిగిన ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో హింస చెలరేగింది. మరోవైపు వలసవాదులకు అనుకూలంగా సెంట్రల్ లండన్లోని వైట్ హాల్ వద్ద ఐదు వేల మంది గుమిగూడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన భారీ ర్యాలీలో 1,10,000 నుంచి 1,50,000 మంది వరకూ పాల్గొన్నారని, అంచనాలకు మించి జనం తరలి వచ్చారని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. వారిలో కొందరు హింసకు తెగబడ్డారని, ఫలితంగా నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ‘నిరసన తెలిపేందుకు తమకు ఉన్న హక్కును వినియోగించుకోవడానికి వారిలో చాలా మంది వచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వారిలో కొందరు హింసకు పాల్పడే ఉద్దేశంతోనే వచ్చారు’ అని అసిస్టెంట్ కమిషనర్ మాట్ ట్విస్ట్ తెలిపారు. హింసకు పాల్పడిన పాతిక మందిని అరెస్ట్ చేశామని, అరెస్టులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. పోలీస్ అధికారులపై దాడి చేసి గాయపరచడాన్ని హోం శాఖ సహాయ మంత్రి షబానా మహమూద్ ఖండించారు.
లండన్లో వలస వ్యతిరేక భారీ ర్యాలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES