భారత్లోనూ లేఆఫ్లు !
నవతెలంగాణ..బిజినెస్డెస్క్
ఇటీవల అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు భారీ స్థాయిలో ఉద్యోగాలను కోత పెట్టిన సంగతి విదితమే. ఇప్పుడు టెలికాం రంగంలో కూడా ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి.. గత కొన్నేళ్లుగా క్రమక్రమంగా ఉద్యోగులను ఇంటిబాటపట్టిస్తున్న నోకియా … ఇప్పుడు ఏకంగా 14 వేలమంది ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయిం చింది. వారిలో భారతీయులు కూడా ఉన్నారు.
20 శాతం కోత ….
ప్రస్తుతం నోకియాలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 74 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా …. అందులో దాదాపు 17 వేల మంది భారత్లో ఉన్నారు. మొత్తం వర్క్ఫోర్స్లో సుమారు 20 శాతం కోత విధించాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా భారత్లో వ్యాపార ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2025 చివరి త్రైమాసికంలో కంపెనీ భారత విభాగంలో నికర అమ్మకాలు 15 శాతం పడిపోవడం గమనార్హం.
అదనపు పదవుల తొలగింపు ….
ఇక సంస్థలో నాయకత్వ మార్పులు కూడా చోటుచేసుకున్నాయి.ఏప్రిల్ 1, 2026 నుంచి సమర్ మిట్టల్ను ఇండియా కంట్రీ బిజినెస్ లీడర్గా, విభా మెహ్రాను కంట్రీ మేనేజర్గా నియమించారు. ఇంతకుముందు ఈ బాధ్యతలు నిర్వహించిన తరుణ్ ఛబ్రా పదవి నుంచి తప్పుకున్నారు. సంస్థలోని క్లౌడ్ అండ్ నెట్వర్క్ సర్వీసెస్, మొబైల్ నెట్వర్క్స్ విభాగాల విలీనం వల్ల ఏర్పడిన అదనపు పదవులను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
క్రమంగా తగ్గుతున్న ఉద్యోగుల సంఖ్య ..!
గత కొన్నేళ్లుగా నోకియాలో ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2018లో లక్షకు పైగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గి పోయింది. భారత్తో పాటు యూరప్లోని గ్రీస్, ఇటలీ,జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో కూడా సుమారు 1,400 మందిని తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది.
టెలికాం రంగంలో కూడా ఉద్యోగాల కోత …
ఇటీవల అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు కూడా భారీ స్థాయిలో ఉద్యోగాలను కోత పెట్టిన నేపథ్యంలో … నోకియా నిర్ణయం టెక్నాలజీ రంగంలో మారుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. ఇదే సమయంలో ప్రత్యర్థి ఎరిక్సన్ కూడా ఉద్యోగుల తగ్గింపుల దిశగా అడుగులు వేస్తుండటం టెలికాం రంగంపై ఒత్తిడి పెరుగుతున్న సంకేతంగా భావిస్తున్నారు.
నోకియాలో భారీ ఉద్యోగాల కోత
- Advertisement -
- Advertisement -



