Friday, June 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమేడారం మహాజాతరకుశాశ్వత పనులు చేపట్టాలి

మేడారం మహాజాతరకుశాశ్వత పనులు చేపట్టాలి

- Advertisement -

ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
భారీ వర్షాల వల్ల నష్టం జరగకుండా
చర్యలు తీసుకోవాలి : మంత్రి ధనసరి సీతక్క
నవతెలంగాణ – ములుగు

వచ్చే సంవత్సరం 2026లో జరగనున్న మేడారం మహాజాతరకు శాశ్వత పనులు చేపట్టాలని, జాతర విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రానున్న మేడారం మహా జాతరను, భారీ వర్షాలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌, ఎస్‌పీ శబరిష్‌, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, డీఎఫ్‌ఓ రాహూల్‌ కిషన్‌ జాదవ్‌, జిల్లా అదనపు కలెక్టర్లు మహేందర్‌ జి, సంపత్‌ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ రవి చందర్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో జరిగిన మహా మేడారం జాతర సందర్భంగా పనిచేసిన జిల్లా అధికారులు నేటికీ అవే బాధ్యతలు నిర్వహిస్తున్నారని, వారి జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే రూ.33కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, రానున్న రోజుల్లో జాతరలో శాశ్వత పనులను నాణ్యతతో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యంగా జాతర సమయంలో మేడారంలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పూర్తిస్థాయిలో మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం మంచినీటిని సరఫరా చేయాలని తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. క్యూ లైన్లు, వాటిపై షేడ్‌ ఏర్పాట్లు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున గ్రామాల్లోని కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, కాలువల్లోని గుర్రపు డెక్కను తొలగించాలన్నారు. వరదలతో రహదారులు, వంతెనలు దెబ్బతి నకుండా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న జాతీయ రహదారికి ఇరువైపుల చెట్లను అటవీ శాఖ, ఆర్‌అండ్‌బీ సిబ్బంది పర్యవేక్షించి అందులో బలహీనమైన చెట్లను తొలగించాలని సూచించారు. జిల్లాలోని లోతట్టు గ్రామాలు, ప్రాంతాలపై ప్రత్యేక దష్టి సారించాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని కటాఫ్‌ గ్రామాలను గుర్తించి ప్రజలను అవసరం మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 3 నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. గోదావరి, జంపన్న వాగు వద్ద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందస్తు ఏర్పాట్లపై అందరినీ అప్రమత్తం చేయాలని తెలిపారు. రెస్క్యూ బృందాన్ని సిద్ధం చేయాలని, ఎవరూ చేపలు పట్టకుండా అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యం లో అవసరమైన వైద్య సేవలు అందిం చాలని చెప్పారు. ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భారీ వర్షాలను, మేడారం మహా జాతర జిల్లా యంత్రాంగం సవాల్‌గా స్వీకరించి అప్రమ త్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్‌, ఆర్డీఓ వెంకటేష్‌, జిల్లా, మండల అధికారులు, మేడారం పూజారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -