- అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
- భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్ ఉండాలి : వారంలో క్షేత్రస్థాయి పర్యటనకు వస్తామన్న ముఖ్యమంత్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మేడారం అభివృద్ధి పనులు వంద రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ప్లాన్ ను సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ మేడారం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను ఆయన పరిశీలించారు. పూర్తిగా సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలుండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు ఉండాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారీగా చెక్ డ్యామ్ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ వారంలో మేడారంకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని అన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కోరారు. బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్ను గౌరవించడంతోపాటు, స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.