ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై భారత్ ఘనవిజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మను చిరంజీవి సన్మానించారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడుతూ, అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్ విజయంలో కీలకమైన భాగస్వామిగా నిలిచిన తిలక్ వర్మ ప్రతిభను అభినందిస్తూ, ఘనంగా సన్మానించారు. ఈ అరుదైన సందర్భానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ వేదిక అవ్వడం విశేషం. తిలక్ వర్మను షూటింగ్కి ఆప్యాయంగా ఆహ్వానించి, ఆయనకు శాలువా కప్పి, మ్యాచ్లోని ఆయన మెమొరబుల్ మూమెంట్ని ఫ్రేమ్ చేసిన ఫోటోను బహుమతిగా అందజేశారు. కృషి, క్రమశిక్షణ కేవలం క్రీడలోనే కాకుండా జీవితంలోనూ విజయానికి మార్గదర్శకమని చిరంజీవి అన్నారు.
ఈ వేడుకలో నయనతార, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గరపాటి, సుస్మిత కొణిదెల తదితరులు సైతం పాల్గొని, తిలక్ వర్మ ఆడిన తీరును ప్రశంసించారు. తనని పిలిచి, ప్రేమతో సన్మానించిన మెగాస్టార్కి ఈ సందర్భంగా క్రికెటర్ తిలక్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్గారు’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల’ విశేష శ్రోతకాదరణతో ట్రెండింగ్లో నిలిచింది. దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతూ 17 మిలియన్ వ్యూస్కి పైగా సొంతం చేసుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తిలక్వర్మని సన్మానించిన మెగాస్టార్
- Advertisement -
- Advertisement -