నవతెలంగాణ హైదరాబాద్: మేఘాలయ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యేల బృందం మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని సందర్శించారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో మేఘాలయ రాష్ట్ర బృందానికి పిఎసి చైర్మన్ ఆర్కేపూడి గాంధీ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వారితో సమావేశమై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల గురించి సభ్యులకు వివరించారు. అసెంబ్లీ నిర్వహించే విధానంతో పాటు, అసెంబ్లీలో ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి చేసే చట్టాలను, రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వారికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ప్రత్యేక రాష్ట్రం ఉద్దేశ్యాలను, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఔన్నత్యం గురించి మేఘాలయ అసెంబ్లీ సభ్యుల బృందానికి ఆయన వివరించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో “విద్యా నిధి” ఏర్పాటు , మహబూబ్ నగర్ ఫస్ట్ లక్ష్యాలను, నిరుద్యోగ యువతకు ఇచ్చే ఉచిత కోచింగ్, నైపుణ్య శిక్షణ సెంటర్ గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా మేఘాలయ అసెంబ్లీ సభ్యుల బృందం అసెంబ్లీ సమావేశాల గురించి, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి, మహబూబ్ నగర్ విద్యా నిధి గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేఘాలయ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చార్లెస్ పిన్గ్రోప్, ఎమ్మెల్యేలు లహ్క్మెన్ రింబుల్, రూపా ఎం. మార్క్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.