నవతెలంగాణ – అశ్వారావుపేట
మందగించిన పాఠశాలల హాజరు శీర్షికన నవతెలంగాణ ల మంగళవారం ప్రచురించిన కథనానికి స్పందిస్తూ మండల విద్యాధికారి ప్రసాదరావు చర్యలు ప్రారంభించారు. మంగళవారం ఉదయం పట్టణంలోని ఎంపీపీ పాఠశాల నందమూరి నగర్ ను ఎంఈఓ స్వయంగా సందర్శించారు. ప్రార్థనా సమయానికే పాఠశాలకు చేరుకున్న ఆయన, విద్యార్థుల హాజరు స్థితిని పరిశీలించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పాఠశాలలో మొత్తం 22 మంది విద్యార్థులు ఉండగా, 17 మంది మాత్రమే హాజరయ్యారని ఆయన తెలిపారు. ఇది ఏకోపాధ్యాయ పాఠశాల కావడంతో ఒక్క ఉపాధ్యాయురాలు హాజరై బోధన కొనసాగించారని పేర్కొన్నారు.
తదుపరి ఎంపీపీ ఎస్ బీసీ కాలనీ పాఠశాల ను కూడా తనిఖీ చేశారు. అక్కడ మొత్తం 60 మంది విద్యార్థుల్లో 44 మంది హాజరయ్యారని, నలుగురు ఉపాధ్యాయుల్లో ముగ్గురు హాజరై విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను వ్యక్తిగతంగా పరిశీలించిన ఎంఈఓ, పాఠశాల రికార్డులు, హాజరు పట్టికలను తనిఖీ చేశారు.
విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలసి కృషి చేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో సీఆర్పీ ప్రభాకరాచార్యలు ఆయన వెంట ఉన్నారు.